కొత్తగూడెం సింగరేణి, జనవరి 26 : భారత రాజ్యాంగం చూపిన బాటలో సింగరేణి పయనిస్తుందని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో శుక్రవారం ఆయన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఒకప్పుడు పేద దేశం, వెనుకబడిన దేశమైన భారత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నదన్నారు. ప్రతి రంగంలోనూ దూసుకుపోతున్నదన్నారు. సింగరేణి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో సహ దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 20 పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తుందన్నారు.
తద్వారా లక్షలాది మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఆ విద్యుత్ దేశాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. సంస్థ కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగాలతో పాటు నిరుద్యోగులైన కార్మికుల పిల్లలకు అనేక రకాలుగా ఉపాధి శిక్షణ ఇస్తున్నామన్నారు. సంస్థ గడించిన ఆదాయంలో కార్మికులకు బోనస్ ఇస్తున్నామన్నారు. సంస్థ పరిధిలో వచ్చే ఏడాది మరో నాలుగు కొత్త గనులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం ఉత్తమ సింగరేణీయన్లను సీఎండీ సన్మానించారు. తర్వాత విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.