ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 16 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో బీఫామ్లు అందజేశారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ బీఫామ్లు అందుకున్న వారిలో ఉన్నారు. ఆదివారం బీఫామ్లు అందుకోవాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వీరు సోమవారం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారని సమాచారం.
కష్టపడి పని చేసి విజయంతో తిరిగి రావాలని ఆశీర్వదించినట్లు తెలిసింది. అలాగే, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని సీట్లను బీఆర్ఎస్ అభ్యర్థులు క్లీన్స్వీప్ చేయాలని వారికి చెప్పినట్లు తెలిసింది. బీఫామ్లు అందుకున్న వెంటనే అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు.