నాడు : గతంలో ఆ గూడేల్లో కరెంట్ సరఫరా లేక భూములన్నీ బీళ్లుగా మారాయి. వారంతా పోడు రైతులే అయినా.. సాగుపై ఆశలు సన్నగిల్లాయి.. సేద్యం చేసేందుకు కన్నీళ్లు తప్ప నీళ్లు లేవు. వరుణుడు కరుణిస్తేనే చేను తడిచేది. లేదంటే నేలలు బీటలు వారి పంటలు ఎండిపోయేవి. పొలాలలన్నీ పడావుగా ఉండడంతో ఏజెన్సీ ఏడారిని తలపించేది. ప్రభుత్వాలు, పాలకులు మారినా వారి తలరాత మారలేదు.. సాగు కష్టాలు తీరలేదు.
నేడు : తెలంగాణ ప్రభుత్వం ఏజెన్సీ రైతుల జీవితాల్లో ఆశల మొలక చిగురింపజేసింది. సాగులో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. సాగు బడిలో సౌర కాంతులు విరజిమ్మింది. ఐదేళ్ల క్రితం తొమ్మిది గ్రామాల్లో రూ.5.40 కోట్లతో సోలార్ బోర్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లాలో ప్రయోగాత్మకంగా సోలార్ బోర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు గిరిజన రైతులు ఏటా రెండు పంటలు పండించుకుంటున్నారు. అరక పట్టి ఆనందంగా సాగు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ):పూర్వ కొత్తగూడెం మండలంలో విసిరేసినట్లుండే గ్రామాలవి. కరెంటు పోవడమే తప్ప రావడం అంత సులభం కాదన్నట్లుగా ఉండే ఊళ్లవి. ఆ గూడేల్లోని రైతుల్లో చాలా వరకూ పోడు భూముల సాగుదారులే. పంటల సాగుకు సాగు నీళ్లు చూస్తామన్న ఆశే లేదు వారికి. కానీ తెలంగాణ సిద్ధించాక వారి గోస తీరి ఆశ నెరవేరిందంటే అతిశయోక్తి కాదేమో. ఏకంగా 9 గ్రామాల్లో 200 మంది గిరిజన రైతులు తమ భూములు సాగు చేసుకునేందుకు ఐదేళ్ల క్రితమే సోలార్ బోర్లు మంజూరు చేసింది తెలంగాణ సర్కారు. రూ.5.40 కోట్ల వ్యయంతో 700 ఎకరాలకు సాగునీరు అందుతుండడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. రాష్ట్రంలోనే తొలి ప్రయోగంగా భద్రాద్రి జిల్లాలో చేపట్టిన సోలార్ బోర్లు విజయవంతం కావడంతో ఆదివాసీ రైతుల తలరాతలు మారినట్లయింది.
తెలంగాణ సిద్ధించి కొత్త జిల్లాలు ఏర్పడ్డాక అప్పటికే కొత్తగూడెం మండలంలో మారుమూలగా ఉన్న బంగారుచెలక పరిసర గ్రామాలను లక్ష్మీదేవిపల్లి మండలంలో కలిపారు. ఉమ్మడి పాలనలో ఆ గ్రామాలకు త్రీఫేజ్ కరెంటు అనే మాటే తెలియదు. ఇక సోలార్ విద్యుత్ గురించి సరేసరి. తెలంగాణ వచ్చాక అక్కడి గ్రామాలకు సోలార్ బోర్లు మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో అక్కడి గిరిజన రైతుల దశ తిరిగినట్లయింది. ఇక మా పొలాలకు సాగు నీరు ఉండదేమో అనుకుంటున్న ఇరపా ఆదినారాయణ లాంటి రైతుల కళ్లల్లో ఆనందాలు వెళ్లివిరిశాయి. అధికారులు వచ్చారు. సోలార్ బోర్లు వేశారు. నీళ్లు పడ్డాయి. పొలమంతా పారాయి. బంగారుచెలక పరిసరాల్లో 9 గ్రామాల్లోనూ సోలార్ బోర్లు పడ్డాయి. ఇప్పటి వరకూ వారికి రెండు పంటలకూ సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. ఫలితంగా పోడు భూముల్లోనూ సిరులు పండుతున్నాయి.
పోడు రైతులు.. సోలార్తో సాగులు..
పోడు రైతులంటే వారిని వ్యవసాయం చేయనివ్వరని అందరూ అనుకునే మాట. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం అలా కాదు. ప్రభుత్వమే పోడు రైతులకు అండగా నిలుస్తోంది. ఏళ్లకేళ్లుగా నలుగుతున్న పోడు సమస్యకు పరిష్కారం చూపిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెల చివరి నాటికి పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇది వరకే పోడు సేద్యం చేస్తున్న రైతులకు అండగా నిలుస్తూ వస్తోంది. బంగారుచెలక పరిసరాల్లోని 9 గ్రామాలకు సోలార్ బోర్లను పరిచయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇద్దరు రైతులకు కలిపి ఒక సోలార్ బోరును మంజూరు చేసింది. వంద శాతం సబ్సిడీతో ఒక్కో బోరుకు రూ. 6 లక్షల వరకూ వెచ్చించింది. దీంతో 200 మంది రైతులకు లబ్ధి చేకూరింది. తొలి పంటగా వరిని సాగు చేసిన రైతులు రెండో పంటగా మిర్చి, పత్తి, పొద్దుతిరుగుడు, జొన్న పంటలను పండిస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో చింతకుంట, లక్ష్మీపురం, ఆర్లగండి, పడగాయగూడెం, బొజ్జలగూడెం, మర్రిగూడెం, తోకబందాల, పునుకుడుచెలక, మైలారం గ్రామాల్లోని గిరిజన రైతులు సోలార్ బోర్లతోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. దీంతో 700 ఎకరాల పైగానే పోడు భూములు సాగులోకి వచ్చాయి.
– భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)
రెండు పంటలకూ సాగునీరు వస్తోంది..
సోలార్ బోర్లతో మాకు రెండు పంటలకూ సాగునీరు అందుతోంది. ఇంతకుముందు మా పొలం పండాలంటే వర్షం కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చాక సోలార్ బోర్లు వేశారు. 5 ఏళ్లుగా విరామం లేకుండా సాగు నీళ్లు పారుతున్నాయి. ఎండ ఉన్నంత సేపు నీరు వస్తూనే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులూ లేవు. తెలంగాణ ప్రభుత్వంలోనే మాకు మేలు జరిగింది. ఎలాంటి సమస్యలు ఉన్నా మేమందరమూ కలిసి కట్టుగా పనిచేసుకుంటాం.
-కాయం పాపయ్య, పునుకుడుచెలక
దారి లేని మా ఊళ్లకు సోలార్ నీళ్లు వచ్చాయి..
తెలంగాణ ప్రభుత్వం దయ వల్ల మా పొలంలో రెండు పంటలూ పండుతున్నాయి. ఇంతటి అటవీ ప్రాంతంలో కరెంటు రావడమే కష్టం. కానీ దారి కూడా సరిగాలేని మా గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం సోలార్ బోర్లు అందించింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. రెండు పంటలూ సాగు చేసుకుంటున్నాం. మిర్చి బాగా పండుతోంది. మొక్క జొన్న కూడా వేస్తున్నాం.
-పాయం అబ్బయ్య, పునుకుడుచెలక
గుట్టల మధ్య ఉన్నా సాగు నీళ్లొస్తున్నాయి..
గుట్టల మధ్య ఉన్నప్పటికీ మా పొలాలకు సాగు నీళ్లు వస్తున్నాయి. రెండు పంటలకూ అందుతున్నాయి. ఒకవేళ వానకాలంలో వర్షమొస్తే ఆ నీళ్లు వినియోగించుకుంటున్నాం. వానలు లేకపోతే వెంటనే సోలార్ బోర్ల ద్వారా నీళ్లను సద్వినియోగం చేసుకుంటున్నాం. గుట్టల మధ్య ఉన్న మాలాంటి వాళ్లకూ సోలార్ నీళ్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.
-ఇర్పా ఆదినారాయణ, పునుకుడుచెలక
రూ.5.40 కోట్లతో 700 ఎకరాలకు..
చింతకుంట, లక్ష్మీపురం, ఆర్లగండి, పడగాయగూడెం, బొజ్జలగూడెం, మర్రిగూడెం, తోకబందాల, పునుకుడుచెలక, మైలారం గ్రామాల్లోని గిరిజన రైతులు ఐదేళ్లుగా సోలార్ బోర్లతోనే వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రూ.5.40 కోట్లు వెచ్చించి వేసిన 90 సోలార్ బోర్ల ద్వారా 700 ఎకరాల పైగానే పోడు భూములను సాగు చేసుకుంటున్నారు.