అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అండగా నిలిచారు. పంట క్షేత్రాలను స్వయంగా పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి వారికి భరోసానిచ్చారు. గురువారం సీఎం, మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోశ్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, డీజీపీ అంజనీకుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి బోనకల్లు మండలంలోని రావినూతల, గార్లపాడులో అకాల వర్షానికి నేలవాలిన పంటలను పరిశీలించారు. పంట నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో సీఎం మాట్లాడారు. పంట నష్టంపై కేంద్రానికి నివేదికలు పంపదలుచుకోలేదని చెప్పారు. గతంలో పంపిన నివేదికలకే దిక్కులేదని ఎద్దేవా చేశారు. దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం రావాలని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీకి రాజకీయాలు తప్ప రైతుల వెతలు పట్టడం లేదని విమర్శించారు.
బోనకల్లు, మార్చి 23: అకాల వర్షం కారణంగా పంట నష్టాన్ని చవిచూసిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసానిచ్చారు. గురువారం ఆయన హెలీకాఫ్టర్ ద్వారా రావినూతల గ్రామంలోని హెలీప్యాడ్కు చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోశ్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సీఎం అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్, డీజీపీ అంజనీకుమార్, ఎమ్మెల్యేలు సండ్ర, కందాళ, రాములునాయక్, మెచ్చా, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి పంటలను పరిశీలించారు. ఈ నెల 15, 16 తేదీల్లో కురిసిన అకాల వర్షంతో బోనకల్లు మండలవ్యాప్తంగా 10,327 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. అధికారులు నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించారన్నారు. రావినూతల, గార్లపాడు గ్రామాల పరిధిలో పంట నష్టం తీవ్రంగా ఉందన్నారు. మక్కలు గింజ దశలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యం సంభవించడం బాధాకరమన్నారు. సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. పర్యటనలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోశ్కుమార్, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, పల్లా రాజేశ్వరరెడ్డి, రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహలత, మధుసూదన్, శిక్షణ కలెక్టర్ రాధికా గుప్తా, జడ్పీ సీఈవో అప్పారావు, డీఏవో విజయనిర్మల, డీఎంహెచ్వో మాలతి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, లావుడ్యా రాములునాయక్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరావు, మాజీ ఎమ్మెల్యేలు బానోతు చంద్రావతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి, సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ ఉన్నారు.
అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. అపారనష్టానికి గురైన రైతులకు సహాయక చర్యల కింద ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 2,28,250 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కర్షకులను ఆదుకునేందుకు రూ.228 కోట్లను తక్షణం మంజూరు చేస్తున్నాం. రైతులు అధైర్య పడొద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. మధిర నియోజకవర్గంలో రైతులతోపాటు కౌలు రైతులూ ఎక్కువగానే ఉన్నారు. కౌలు రైతులకు జరిగిన నష్టాన్నీ గుర్తించి పరిహారం అందిస్తాం..
దేశంలో ఓ పద్ధతి, పాడు లేదు.. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప.. రైతులకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. పాత ప్రభుత్వాలూ అంతే.. ఇప్పుడు కూడా అంతే.. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు తప్ప ప్రజలు, రైతుల గురించి పట్టింపులేదు.
మా రైతులను మేమే ఆదుకుంటాం. భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చిండు.. వందశాతం మేమే ఆదుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్, ఉచిత నీళ్లు, వాటర్సెస్ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకోవడంతో వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నది. ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదు కాబట్టి ఈ రంగాన్ని నిర్వీర్యం కానివ్వం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు.
బోనకల్లు మండలంలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారైందని తెలుసుకుని బుధవారం సాయంత్రం రావినూతల శివారులో యుద్ధప్రాతిపదికన కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్ హెలీప్యాడ్ ఏర్పాటు చేయించారు. వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేసి రామాపురంతోపాటు మండలవ్యాప్తంగా సంభవించిన పంట నష్టం వివరాలపై నివేదికలు సిద్ధం చేయించారు. అర్ధరాత్రి వరకు ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. పనులను మంత్రి అజయ్కుమార్, జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పరిశీలించారు. బందోబస్తుపై యంత్రాంగానికి సలహాలు సూచనలిచ్చారు. గురువారం ఉదయం నుంచే మండలానికి చెందిన రైతులు సీఎం కేసీఆర్ రాక కోసం ఎదురుచూశారు. సీఎం హెలీప్యాడ్ వద్దకు చేరుకోగానే తొలుత పంట నష్టానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, హెలీప్యాడ్ వద్ద సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు నిరంజన్రెడ్డి, అజయ్కుమార్, రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోశ్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, సీఎం అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్కు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ రైతులు బోయినపల్లి కృష్ణయ్య, పొందూరి రాంబాబు, బోయినపల్లి నర్సింహారావు, వట్టికుంట రామకృష్ణ, బోయినపల్లి అచ్యుతరావు, కొచ్చర్ల కృష్ణ, మొక్కపాటి అప్పారావు, కేతినేని నర్సింహారావు, ముక్కపాటి వీరయ్య, కేతినేని హనుమంతరావుతో పలువురి సమస్యలు విన్నారు. వారి వెంట ఎమ్మెల్సీలు తాతా మధు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పంట నష్టానికి సంబంధించిన వివరాలపై వ్యవసాయశాఖ నుంచి నివేదికలు తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్కు వినతిపత్రం అందజేశారు.