అకాల వర్షం పంటలను నీట ముంచింది.. రైతును నష్టాల ఊబిలోకి నెట్టింది.. కంట కన్నీరే మిగిల్చింది.. తీరని నిరాశలో ఉన్న రైతుల్లో భరోసా నింపేందుకు సీఎం కేసీఆర్ గురువారం ఖమ్మం జిల్లాకు రానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. బోనకల్లు మండలంలోని రామాపురం గ్రామంలో దెబ్బతిన్న పంట క్షేత్రాలను స్వయంగా పరిశీలించి రైతులకు భరోసా కల్పిస్తారని చెప్పారు. అనంతరం వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులను సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు రామాపురంలో ప్రత్యేకంగా హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. పర్యటనలో మంత్రి అజయ్కుమార్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
ఖమ్మం, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించనున్నారు. నాలుగు రోజుల క్రితం అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న యాసంగి మక్క, పెసర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం విదితమే. మంత్రి అజయ్కుమార్ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి పంటల నస్టాన్ని అంచనా వేసి నివేదిక సిద్ధం చేశారు. పంట నష్టం వివరాలను మంత్రి పువ్వాడ ఇప్పటికే సీఎం కేసీఆర్కు వివరించారు. దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించి రైతులకు భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను తెలుకుంటారనే ఉద్దేశంతో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు బోనకల్లు మండలంలో పర్యటించి రామాపురంలో హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. రామాపురంలో పంట దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పిస్తారు. ఆయా గ్రామాల్లో రైతులతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్షించనున్నారు.
31,038 ఎకరాల్లో పంట నష్టం..
అధికారుల గణంకాల ప్రకారం జిల్లాలో అకాల వర్షాలకు 19,552 మంది రైతులకు సంబంధించిన 31,038 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా 30,792 ఎకరాల్లో మొక్కజొన్న, 226 ఎకరాల్లో పెసర, 20 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. బోనకల్లు మండలంలో మక్క పంట భారీగా దెబ్బతిన్నందున అదే మండలంలో పర్యటించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. కలెక్టర్, సీపీలు రాత్రి వరకు లక్ష్మీపురం గ్రామంలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎంతోపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ఉన్నతాధికారులు పర్యటించనున్నారు.
రైతులకు భరోసా కల్పించేందుకే: ఎమ్మెల్సీ మధు
అకాల వర్షం, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు బోనకల్లు మండలం రామాపురం చేరుకుంటారు.
పంటలు, హెలీప్యాడ్ను పరిశీలించిన కలెక్టర్, సీపీ
బోనకల్లు, మార్చి 22: ఈ నెల 15, 16 తేదీల్లో అకాల వర్షం కారణంగా మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా అందుకు అవసరమైన ఏర్పాట్లను ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు బుధవారం రాత్రి పరిశీలించారు. సంబంధిత అధికారులతో వెళ్లి నేలవాలిన పంటలను పరిశీలించారు. మండలంలో 15 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేయగా అకాల వర్షం కారణంగా 10,217 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేశారు. రామాపురంలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, ఏడీసీపీ సుభాశ్చంద్రబోస్, ఆర్డీవో రవీంద్రనాథ్, డీఏవో విజయనిర్మల, జడ్పీ సీఈవో అప్పారావు, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.
అన్నదాతలకు అండగా..
అకాల వర్షం పంటలను నీటిపాలు చేసింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న, పెసర దెబ్బతిన్నది. వందలాది మంది రైతులు నష్టపోయారు. రైతుల పంట క్షేత్రాలను పరిశీలించడంతోపాటు వారికి భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారు. అన్నదా తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది.
– మంత్రి పువ్వాడ అజయ్కుమార్