ఖమ్మం సిటీ, జనవరి 17 : అంధత్వ వ్యాధులను పూర్తిస్థాయిలో నిర్మూలించి.. తెలంగాణ బిడ్డల కండ్లలో కాంతులు నింపాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటిసారి లక్షలాది మందికి కంటి పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే మందులు, కళ్లద్దాలు అందజేశారు. సమస్య తీవ్రత ఆధారంగా ఆపరేషన్ల నిమిత్తం మరికొందరిని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు సిఫారస్ చేశారు.
రెండో విడత కార్యక్రమంలో భాగంగా వంద రోజుల్లో ఖమ్మం జిల్లాలో దాదాపు 15 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలి. మొత్తం 589 గ్రామ పంచాయతీలు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలోని 125 పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించారు. 55 బృందాలు, 714 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో మెడికల్ ఆఫీసర్, కంటి వైద్య నిఫుణుడు, సూపర్వైజర్, ఇద్దరు లేదా ముగ్గురు ఏఎన్ఎంలు, డీఈవో ఒకరు, ముగ్గురు లేదా నలుగురు ఆశాలు ఉంటారు. రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 300 మంది, పట్టణ ప్రాంతాల్లో 400 మందికి కంటి పరీక్షలు చేయనున్నరు.
కొత్త కలెక్టరేట్లో విస్తృత ఏర్పాట్లు..
కంటి వెలుగు రెండో విడత ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ యంత్రాంగం కొత్త కలెక్టరేట్లో విస్తృత ఏర్పాట్లు చేసింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమ వివరాలు తెలిసేలా శిబిరాలను సిద్ధంగా ఉంచారు. రిజిస్ట్రేషన్, ఆన్లైన్, కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాల పంపిణీకి సంబంధించిన టేబుల్స్ను స్టాల్స్ వారీగా నెలకొల్పారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రఘునాథపాలెం మండలం, మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వీవీ పాలెం, ఇతర గ్రామాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనుబోతు రామనాథం, కోలెం జ్యోతి, ధరావత్ పిచ్చెమ్మ, ఏ వెంకటేశ్వరమ్మ, అమరనేని వెంకటేశ్వర్లు, గౌష్యాబేగం ఉన్నారు. వీరికి ముఖ్యమంత్రుల సమక్షంలో కంటి పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే వారి చేతుల మీదుగా కళ్లద్దాలు అందించనున్నారు. ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధు, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి శ్యామ్రిజ్వి, కమిషనర్ శ్వేతామహంతి, రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ రామకృష్ణ, ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, డీఎంహెచ్వో డాక్టర్ బీ మాలతి, ఖమ్మం జిల్లా ప్రొగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ రాంబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తుండటం గమనార్హం.
నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..
కంటి వెలుగు శిబిరాల వద్దకు వెళ్లేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకెళ్లాలి. ఎన్రోల్ అనంతరం వివిధ రకాల పరీక్షలు పూర్తిచేసి మెడికల్ కేసులకు అక్కడికక్కడే చుక్కల మందు, టాబ్లెట్స్ ఇస్తారు. దృష్టిలోపం (ప్లస్-1, ప్లస్ 1.5, ప్లస్-2, ప్లస్ 2.5) ఉన్నవారందరికీ అక్కడే రీడింగ్ కళ్లద్దాలు అందజేస్తారు. ప్రిస్క్రిఫ్షన్ గ్లాసులు అవసరమైన వారికి ఆర్డర్పెట్టి కేవలం రెండు నుంచి మూడువారాల వ్యవధిలో ఏఎన్ఎం, ఆశాల సాయంతో ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నారు. కంటి పరీక్షకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ రిజిస్ట్రేషన్ ప్రకారం ఒక బార్ కోడ్ కేటాయిస్తారు. ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ఖ మ్మం వేదికగా వైభవంగా నూతన కలెక్టరేట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం అచ్యుతానందన్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్యాదవ్, సీపీఐ జాతీయ నాయకులు డీ రాజా, ఇతర అతిరథ మహారథుల సమక్షంలో తెలంగాణ జాతికి కంటి వెలుగులను ప్రసాదించబోతున్నారు.