ఖమ్మం, ఆగస్టు 21: బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ చేయని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది మంది బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకూ బ్రాహ్మణులు కృషి చేసి చేయాలని కోరారు. కేసీఆర్ను మూడోసారీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ఉషాహరి కన్వెన్షన్లో ఈశ్వరిప్రగడ హరిబాబు అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగిన ఉమ్మడి జిల్లా బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేసి దానికి రూ.100 కోట్ల నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. మాజీ ప్రధాని పీవీ మహానాయకుడని, అలాంటి నేత దేశానికి చేసిస సేవలను గుర్తించి ఆయన జయంతి ఉత్సవాలను జరిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని గుర్తుచేశారు. 600 మంది బ్రాహ్మణ విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున అందించి విదేశాలకు పంపారని, హైదరాబాద్లో బ్రాహ్మణ సదన్కు 9 ఎకరాల స్థలం కేటాయించారని వివరించారు. బహ్మణులు ఐక్యంగా ఉండాలని, చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పెరిగేలా కృషి చేస్తామని, కేఎంసీ కో ఆప్షన్లో స్థానం కల్పిస్తామని, నామినేటేడ్ పోస్టుల్లో అవకాశాలు ఇస్తానని అన్నారు.
కేసీఆర్తోనే బ్రాహ్మణులకు గుర్తింపు..
ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ.. దేశంలో బ్రాహ్మణులకు గుర్తింపుచ్చింది సీఎం కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. మాజీ ప్రధాని పీవీ లాంటి గొప్ప వ్యక్తికి గౌరవం కల్పించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. బ్రహ్మణ జాతికి ఆదర్శం పీవీ నర్సింహారావు అని అన్నారు. అలాగే కేసీఆర్ను మూడోసారీ సీఎంగా గెలిపించుకోవాలని, ఖమ్మంలో అజయ్కు అత్యధిక మెజార్టీతో అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం అజయ్, వాణీదేవీలను బ్రాహ్మణులు ఘనంగా సత్కరించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, ఆర్జేసీ కృష్ణ, మామూలూరి మురళీధర్రావు, మల్లాది వాసుదేవ్, రఘునాథాచార్యులు, లక్ష్మీ సుజాత, రమణమూర్తి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.