‘ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యానికి కొదువ లేదు. ఇక్కడి ప్రజలు విజ్ఞులు, ఎవరిని.. ఎందుకు.. గెలిపించుకోవాలో వారికి తెలుసు. ప్రజలు ఓటు వేసే సమయంలో అభ్యర్థుల గుణంతోపాటు గణం చూడాలి. అభ్యర్థితోపాటు అభ్యర్థి వెనుక ఉన్న రాజకీయ పార్టీని చూడాలి. ఆ పార్టీకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చగల శక్తి ఉందో.. లేదో.. బేరీజు వేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మలను తెచ్చుకుంటే తుమ్మ ముల్లు గుచ్చుకున్నట్లే. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడను గెలిపించుకుంటే ప్రజలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆదివారం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.
‘ఖమ్మంలో సెంట్రల్ లైటింగ్, ఆరు లేన్ల రోడ్లు, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడటానికి ఒక్కరోజు మంత్రం వేస్తేనో.. మాయ చేస్తేనో జరగలేదు. మంత్రిగా పువ్వాడ పనిచేస్తేనే జరిగింది. ప్రజలకు సేవ చేయాలనే తపన, అభివృద్ధిపై శ్రద్ధ్ద ఉంటే ఖమ్మంలా సుందరమైన నగరం అవుతుంది. వాడవాడలా పువ్వాడ అంటూ.. పత్రికల్లో వార్త వచ్చినప్పుడు ఆసక్తిగా గమనించేవాడిని. సైకిల్ వేసుకొని ప్రజల్లో ఒకడిగా తిరిగి వారి సమస్యలను తెలుసుకోవడం పువ్వాడ సేవా నిరతికి నిదర్శనం. ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయడానికి అజయ్ ఎంతో ఉబలాటపడేవారు. రూ.వేల కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేసుకున్న అజయ్ రూ.700 కోట్లతో మున్నేరుపై తీగల వంతెన మంజూరు చేసే దాకా పట్టుబట్టారు. ఒక దశలో నాతో కొట్లాడాడు.’
ఖమ్మం ప్రజలు నాడు నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొనేవారని సీఎం అన్నారు. కాలువలు ఇరుకుగా ఉండేవన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. గోళ్లపాడు చానల్ను ఆధునీకరించి నగర ప్రజలను మురికి కూపం నుంచి మంత్రి అజయ్ బయటపడేశారన్నారు. నేడు ఖమ్మం అభివృద్ధి సాధించిందంటే మాయ చేస్తేనో, మంత్రం వేస్తేనో కాదని అన్నారు. అజయ్ పట్టుబట్టి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు. ‘వాడవాడకు పువ్వాడ’ పేరుతోసైకిల్ తొక్కుతూ ఇంటింటికీ వెళ్లి సమస్యలు పరిష్కరించిన తీరు అద్భుతమన్నారు. ఆ వార్తలను తాను పత్రికల్లో చూశానన్నారు. మున్నేరు ముప్పు తొలగిపోవాలని తీగల వంతెన, వాల్స్ నిర్మాణానికి నిధులు విడుదల చేయించుకున్నారని గుర్తుచేశారు.
ఖమ్మం, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మలను తెచ్చుకుంటే తుమ్మ ముల్లు గుచ్చుకున్నట్లేనని, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడను గెలిపించుకుంటే ప్రజలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఆదివారం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ అధ్యతన నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. నగరంలో అభివృద్ధికి కొనసాగింపు ఉండాలంటే ప్రజలు పువ్వాడను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో రాజకీయ చైతన్యానికి కొదువ లేదన్నారు. జిల్లాకు చెందిన కవి దివంగత రావెళ్ల వెంకట రామారావు 70 ఏళ్ల క్రితమే తెలంగాణపై గొప్ప కవిత్వం రాశారని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజలు విజ్ఞులని, ఎవరిని.. ఎందుకు.. గెలిపించుకోవాలో వారికి తెలుసన్నారు. ప్రజలు ఓటు వేసే సమయంలో అభ్యర్థుల గుణంతోపాటు గణం చూడాలన్నారు. వెనుక ఉన్న రాజకీయపార్టీని కూడా చూడాలన్నారు. ఆ పార్టీకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చగల శక్తి ఉందో.. లేదో.. బేరీజు వేసుకోవాలన్నారు. పని చేసే పార్టీకి ఓట్లు వేస్తే ప్రజలే గెలిచినట్లు అవుతుందన్నారు. ఓటు వజ్రాయుధమన్నారు. ప్రజలు ఆ ఆయుధాన్ని మంచి మార్పు కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ‘విజన్’ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ‘మిషన్’ తోడైతేనే అభివృద్ధికి బాటలు పడతాయన్నారు.
2014 ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న ఓ నేతకు మంత్రి పదవి ఇచ్చానని ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. కానీ 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క అజయ్కుమార్ తప్ప గెలవలేదన్నారు. మొత్తంగా తుమ్మల పార్టీకి చేసిన ప్రయోజనం గుండు సున్నా అన్నారు. ఓడిపోయిన తుమ్మలకు మంత్రి పదవి వస్తే, ఆయన రివర్స్లో తనకు మంత్రి పదవి ఇప్పించానని గప్పాలు కొడుతున్నారని మండిపడ్డారు.
జిల్లాలో కరకట దమనులు ఇద్దరు ఉన్నారని, వారు ఎవరో, వారి వ్యవహార శైలి ఏమిటో తెలుసుకోవాలంటే చిన్నయసూరి రాసిన కథ చదవాల్సిందేనని సీఎం అన్నారు. కరకట దమనులు బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వమని అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. జిల్లా ప్రజలను వాళ్లేమైనా ఏమైనా గుత్తా పట్టారా..? ఇంతటి నియంతృత్వాన్ని చైతన్యవంతమైన ప్రజలు భరిస్తారా? అని ప్రశ్నించారు. కరకట దమనుల పీడ బీఆర్ఎస్కు వదలిందన్నారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వర్గాలకు చేసిందేమీ లేదన్నారు. ఆ పార్టీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా దశాబ్దాలుగా వాడుకున్నదని ఉర్దూలో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ మైనార్టీల అభ్యున్నతికి ఏటా రూ.900 కోట్లు వెచ్చిస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. తెలంగాణను సెక్యూలర్ రాష్ట్రంగా కాపాడతామన్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను ముస్లింలు అజయ్ఖాన్గా పిలుచుకోవడం తనను అబ్బుర పరిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీ ప్రజలు అజయ్ఖాన్ను ఆశీర్వదించాలన్నారు.
ఎన్నికలు రాగానే అభివృద్ధి మంత్రాలను జపించే కాంగ్రెస్, బీజేపీలు ఏనాడైనా తెలంగాణ జెండా పట్టుకున్నాయా? తెలంగాణ కోసం నినదించాయా? అని సీఎం ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లైట్ హైదరాబాద్లో, స్విచ్ ఢిల్లీలో ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములని అభివర్ణించారు. అజయ్కుమార్ కృషితోనే ఖమ్మంలో ఐటీ హబ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. జిల్లాకు వైద్య కళాశాల కావాలని అజయ్కుమార్ పట్టుబట్టి మంజూరు చేయించుకున్నారన్నారు. నగరంలో సకల హంగులతో బస్టాండ్ నిర్మించారన్నారు. అలాగే ఆర్టీసీ కల్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నారని కొనియాడారు. తాగునీటి కోసం యుద్ధాలు జరిగిన ఘటనలు జరిగాయని గుర్తుచేశారు. ఇప్పుడు మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాలు వచ్చాయన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ నీరజ, పార్టీ అభ్యర్థులు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, లింగాల కమల్రాజు, మదన్లాల్, ఎమ్మెల్యే రాములునాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణచైతన్య, ఏఎంసీ చైర్మన్ శ్వేత, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నేను ఖమ్మం భూమి పుత్రుడిని.. ఇక్కడే పుట్టి పెరిగా.. ఇక్కడే చదువుకున్నా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో మంత్రినయ్యాను. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను.’ అని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ‘ఐటీ హబ్, ధంసలాపురం రైల్వే బ్రిడ్జి, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు, డివైడర్లు, లకారం ట్యాంక్.. ఇలా ఒకటా రెండా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను. నాడు గొంగళి పురుగుగా ఉన్న నగరాన్ని ఇప్పుడు సీతాకోకచిలుకలా చేశాను. 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించా. రఘునాథపాలెం మండలంలోనే రూ.250 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టాం. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ నగరానికి విచ్చేసి ‘పువ్వాడను గెలిపించండి ప్రజలారా.. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు..’ అని చెప్పారు. నేను ఎన్నికల్లో గెలిచి ఆయన మాటలను నిజం చేశాను. ఖమ్మంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అనేక పదవులు ఇచ్చాను. రాజ్యాధికారాన్ని కట్టబెట్టాను. నగరంలో మైనార్టీ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారి సోదరుడిగా నేను ఎంతో చేశాను. ఆ ప్రేమతోనే వారంతా నన్ను ‘అజయ్ఖాన్’ అని పిలుస్తున్నారు. నాడు నాపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నాడు అనేక పదవుల్లో ఉన్నారు. అయినప్పటికీ నగరానికి చెందిన అక్కాచెల్లెళ్లు తాగునీటి కోసం ఇబ్బంది పడ్డారు. ఆ సమస్యను ఆయన పట్టించుకోలేదు. తుమ్మల ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ మారతారు. నాడు టీడీపీ అధినేత చంద్రబాబును, ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మోసం చేశారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి కూడా తుమ్మలకు చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అపర భగీరథుడిగా సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ తీసుకొచ్చారు. మున్నేరు వరద ముప్పు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళితే ఆర్సీసీ వాల్, తీగల వంతెన నిర్మాణాలకు రూ.690 కోట్లు విడుదల చేశారు.’ అని వివరించారు.