రఘునాథపాలెం, అక్టోబర్ 8 : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇక్కడ నేను, కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జోస్యం చెప్పారు. ఆదివారం రఘునాథపాలెం మండలం బూడిదెంపాడు, మంచుకొండ గ్రామాల్లో పర్యటించిన ఆయన సుమారు రూ.32కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండలానికి ఇటీవల మంజూరైన పంచాయతీరాజ్, ఈజీఎస్ శాఖల పనులకు సంబంధించి రూ.31కోట్లతో 12 రోడ్ల నిర్మాణ పనుల పైలాన్ను మంత్రి మంచుకొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సభలనుద్దేశించి మంత్రి పువ్వాడ మాట్లాడారు. మంత్రిగా నా నాలుగేళ్ల పాలనకు ముందు.. ప్రస్తుతం జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి గ్రామ ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి నాయకులకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగిన అభివృద్ధిపై ప్రగతి నివేదిక కరపత్రాలను ముద్రించామని, వాటిని నాయకులు ఇంటింటికీ చేర్చి వివరించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటే అది కేవలం మంత్రిగా ఉన్న అజయ్కుమార్తోనే సాధ్యమైందనే విషయాన్ని గమనించాలన్నారు. నియోజకవర్గానికి మంజరయ్యే నిధులు, సంక్షేమ పథకాల్లో సింహభాగం ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేనికి కేటాయిస్తున్నామన్నారు. దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలపై కొందరు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని అసలే నమ్మొద్దన్నారు.
పథకాలకు సంబంధించి అర్హులందరికీ న్యాయం చేస్తామని, రెండో విడత జనవరిలో మొదలు పెట్టుకుందామని మాట ఇచ్చారు. మంత్రి వర్గంలో నేను ఉండబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్తో కొట్లాడి పెద్ద మొత్తంగా నిధులు తీసుకొచ్చానన్నారు. ఎన్నికల అనంతరం మరోమారు గెలిచిన వెంటనే రఘునాథపాలెం రైతు వేదికతో ఆగిపోయిన ఆరు వరుసల రోడ్డును బూడిదంపాడు పవర్గ్రిడ్ వరకు తీసుకొచ్చి నా చిత్తశుద్ధి ఏమిటో నిరూపించుకుంటానని మంత్రి అభయమిచ్చారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వచ్చిన మంత్రికి ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా మంత్రి గ్రామాల్లో రోడ్డు షో ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాలోతు ప్రియాంక, ఎంపీపీ గౌరి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ ఎంపీపీ గుత్తా రవి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్లు పిన్ని కోటేశ్వరరావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, మాజీ జడ్పీటీసీ కుర్రా భాస్కర్రావు, ఆత్మ చైర్మన్ భుక్యా లక్ష్మణ్నాయక్, సర్పంచ్లు షేక్ మీరా సాహెబ్, మెంటం రామారావు, నాయకులు దిరిశాల శ్రీనివాసరావు, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్, నున్నా శ్రీనివాసరావు, తేజావత్ రమేశ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంద సంజీవరావు, విజయరావు, తాతా వెంకటేశ్వర్లు, జాటోతు సూర్య, బానోతు దేవేందర్, భుక్యా సైదులు, కుతుంబాక నరేశ్, తొలుపునూరి దానయ్య, వెంకటప్పారావు, ఎంపీటీసీలు తేజావత్ విజయ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.