‘అప్పున్నదని రైతు టెన్షన్ పడొద్దు.. పంట పెట్టుబడికి బయట రుణం తేవొద్దు.. కరెంటు లేదని దిగులు చెందొద్దు.. సాగునీరు లేదని బాధపడొద్దు.. విత్తనాలు, ఎరువులు అందలేదని అధైర్యపడొద్దు.. రంది లేకుండా సాగును పండుగలా చేసుకోవాలి’ అనేది సీఎం కేసీఆర్ కల. ఆ కలను నెరవేర్చుతూ.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలనూ నెరవేరుస్తున్నారు. తాజాగా రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. ప్రకటనపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఊరూరా సంబురాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మూడోరోజు శుక్రవారమూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్కు జేజేలు పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
-నమస్తే నెట్వర్క్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రుణమాఫీ సంబురాలు మూడో రోజూ కొనసాగాయి. శుక్రవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. రైతు పక్షపాతి కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అడగకున్నా తమకు సాగుపరంగా అన్నీ సమకూరుస్తూ భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మరచిపోమని, జీవితాంతం గుర్తుంచుకుంటామని, తాము బీఆర్ఎస్ పక్షానే నిలుస్తామని పేర్కొన్నారు.