సత్తుపల్లి టౌన్, సెప్టెంబరు 10 : రాష్ట్రంలోని దళితుల ఆర్థిక సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఇచ్చే దమ్ము కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఉందా అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. దళిత కుటుంబాలు బాగుపడాలని సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారని, ఈ పథకాన్ని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇచ్చే సత్తా వారికి ఉందా అని ప్రశ్నించారు.
పేదలను సీఎం సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే 2019 నుంచి 2023 వరకు 5వేల మందికి రూ.25.50 కోట్లను సీఎంఆర్ఎఫ్ నుంచి అందించారని తెలిపారు. వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాకేంద్రంలో వెయ్యి పడకల ఆసుపత్రితోపాటు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని, ఈ నెల 14న మంత్రి హరీశ్రావు ఖమ్మం జిల్లాకేంద్రంలో వైద్యకళాశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానలు, పట్టణ ప్రాంతాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రోడ్లు వేశామని చెప్పుకుంటున్న కొందరు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోడ్లు నిర్మించారు తప్ప సొంత ఖర్చులతో కాదని వివరించారు.
ప్రతి కార్యకర్త సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సత్తుపల్లి పట్టణంలోని పలు కాలనీల్లో సింగరేణి బాంబు బ్లాస్టింగ్ల కారణంగా ఇళ్లు దెబ్బతిన్న బాధితులను గృహలక్ష్మి పథకం ద్వారా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సిద్ధిపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన రామానగరానికి చెందిన సౌమ్యను ఎమ్మెల్యే సండ్ర సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు రఫీ, కార్యదర్శి మల్లూరు అంకమరాజు, కౌన్సిలర్లు చాంద్పాషా, ఆనందరావు, బీఆర్ఎస్ నాయకులు కనగాల వెంకట్రావు, లక్కినేని సునిల్ పాల్గొన్నారు.