‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండొద్దు. ఆకలితో వచ్చి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటూ అవస్థలు పడొద్దు. ఉదయమే వారి ఆకలి తీర్చేందుకు.. పెరుగుతున్న పిల్లల ఎదుగుదలకు దోహదపడే విధంగా పోషకాహారం అందించాలి’ ఇందుకోసం సీఎం కేసీఆర్ ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.
– ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 5
ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 5 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. విద్యా వ్యవస్థలో ఇప్పటికే సమూల మార్పులు తెచ్చిన సర్కారు దసరా కానుకగా తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులందరికీ ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ను అమలు చేయనున్నది. దసరా పం డుగకు ముం దుగా నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసి ‘ముఖ్యమంత్రి అల్పాహార’ పథకం అమలు చేయనున్నది. ఎంపిక చేసిన పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఆరు రోజులపాటు అల్పాహారం అందించి పథకం అమలు తీరును పరిశీలించనున్నది. ఈ మేరకు జిల్లాలోని ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలను ఈ పథకం కింద ఎంపిక చేసింది.
వీటిలో శుక్రవారం నుంచే ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించనున్నాను. ఖమ్మం నియోజకవర్గంలో రోటరీ నగర్ జడ్పీ ఉన్నత పాఠశాలను పథకానికి ఎంపిక చేయగా.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని’ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు డీఈవో సోమశేఖర శర్మ గురువారం పాఠశాల హెచ్ఎం మోత్కూరి మధు, వంట అందించే స్వయం సహాయక సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆరు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే మెనూ ప్రకారం అల్పాహారం అందించడంపై వంట ఏజెన్సీ సిబ్బందితో చర్చించారు. అంతేకాక వరంగల్కు చెందిన అక్షయపాత్ర ఏజెన్సీతో ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో దసరా నుంచి అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది.
నియోజకవర్గాల్లో ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు
జిల్లాలో నియోజకవర్గానికో పాఠశాలను ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకానికి ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో శుక్రవారం సీఎం అల్పాహారం పథకాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖాధికారులు ఎమ్మెల్యేలతోపాటు ఆయా ప్రాం తాల ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు.
పోషణ, హాజరు లక్ష్యంగా…
విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం పోషణతోపాటు హాజరు లక్ష్యంగా అమలు చేస్తున్నారు. దసరా సెలవుల అనంతరం జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ అల్పాహారం అందించనున్నారు. పిల్లల్లో పోషకాహారం లోపం, తరగతి గదిలో ఆకలి నివారించడం, విద్యార్థుల ఆరోగ్యం, పెరుగుదలను మెరుగుపరిచేందుకు దోహదపడేలా కార్యక్రమాన్ని రూపొందించారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు మొబైల్ యాప్ ద్వారా దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.