భద్రాద్రి కొత్తగూడెం .ఫిబ్రవరి 18: పదవ తరగతి ఫలితాలు విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాల సాధనకు మార్గదర్శకాలు అని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెంలోని అంబేద్కర్ భవన్ ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ-శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో ఎన్ని మార్కులు వస్తాయని విద్యార్థులు ఆలోచించకుండా వారి భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి చదవాలని అన్నారు. కేవలం పదవ తరగతి మాత్రమే ప్రామాణికంగా తీసుకోరాదని అన్నారు. పదవ తరగతి అనేది ఒక మెట్టు మాత్రమేనని, తర్వాత అనేక కోర్సులు చేయాలని అన్నారు. నిరంతరం కష్టపడుతూ ఉంటే లక్ష్యాలను సాధించుకోవచ్చని అన్నారు. తానూ విద్యార్థి దశలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని చెప్పారు. పదవ తరగతి చదువుకునేటప్పుడు ఒక మంచి ఇంజనీర్ అవుదామని అనుకున్నా, తర్వాత నా లక్ష్యాలను మార్చుకొని పట్టుదలతో చదివి ఐఏఎస్ సాధించానని తన అనుభవాన్ని విద్యార్థులతో కలెక్టర్ పంచుకున్నారు.
విద్యార్థులు ఒక మంచి జీవితం కోసం ప్రేరణ కలిగి ఉండాలని జీతేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతోపాటు అన్ని రకాల పుస్తకాలు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ హవర్స్, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించి నిపుణులతో ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షలకు కొన్ని రోజులే సమయం ఉన్నందున సమయాన్ని వృధా చేయవద్దన్నారు. విద్యార్థులు టీవీ, ఫోన్, సోషల్ మీడియా లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాధించాలని, హాస్టల్లో విద్యార్థులను హాస్టల్ వార్డెన్లు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి జిల్లాలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా శిక్షణ అందించాలని కలెక్టర్ అన్నారు.
విద్యాశాఖ రిసోర్స్ పర్సన్లు సైదులు, నాగరాజు శేఖర్, నాగరాజు, విజయ భాస్కర్, శ్యాం చందర్ రావు విద్యార్థులకు శిక్షణ తరగతుల్లో వివిధ సబ్జెక్టుల్లో మెలకువలు నేర్పారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అనసూర్య, ఏఎస్డబ్ల్యూ ఓ లు హనుమంతరావు, సునీత, హెచ్ డబ్ల్యుఓలు గజ్వేల్ శ్రీనివాస్, పద్మావతి, శశిరేఖ, కౌసల్య, రామ నరసయ్య, స్వప్న, కార్యాలయ సిబ్బంది నరసింహారావు, పార్వతి శశికళ, హేమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.