ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. విద్యార్థులకు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు రాకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. కేంద్రాల్లోకి ఇతరులెవరూ వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లను అనుమతించడం లేదు. పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచుతున్నారు. ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. మంగళవారం కలెక్టర్, అదనపు కలెక్టర్లు, శిక్షణ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ రెవెన్యూ, వైద్య, పంచాయతీ, విద్యుత్, పోస్టల్, ఆర్టీసీ, మున్సిపల్, రవాణా, చీఫ్ సూపరింటెండెంట్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 4: ఉమ్మడి జిల్లాలో టెన్త్ పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులతోపాటు నిర్వహణలో కీలకమైన సీఎస్లు, డీవోలు, ఇన్విజిలేటర్లు ఇతరత్రా సిబ్బంది బాధ్యతలు నిర్వర్తిస్తున్న తీరును ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. పరీక్ష ముగుస్తున్న సమయంలో కేంద్రాల్లోకి వచ్చే వారిని గుర్తించేందుకు సిట్టింగ్ స్కాడ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ మరింత అప్రమత్తంగా ఉంటూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.
విధి నిర్వహణలో ఉన్న వారిని తప్ప మరెవ్వరూ పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఫ్లయింగ్ స్కాడ్లు తనిఖీలకు వెళ్లినా బయట కారులోనే ఫోన్లు ఉంచాలనే నిబంధనలను డీఈవో పక్కాగా అమలు చేస్తున్నారు. డీఈవో కూడా ఫోన్ తీసుకెళ్లడం లేదు. కేంద్రాల వద్ద ఏం జరుగుతుందనే సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా సేకరిస్తూ అధికారులను అప్రమత్తంగా ఉన్నారు.
పరీక్షల నిర్వహణపై ఎలాంటి ఆరోపణలు రాకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు సెట్ కాన్ఫరెన్స్లో సైతం సూచనలు చేస్తున్నారు. ఖమ్మంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఈ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. మారుమూల ప్రాంతాల్లోని పరీక్షల కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నారా? లేదా? అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం నగరంలోని నిర్మల్హృదయ్, ఎన్ఎస్సీ కాలనీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాసే విధానాన్ని పరిశీలించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పర్యవేక్షించాలని, కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించొద్దని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్ను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు, శిక్షణ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కూడా కలిసి పది కేంద్రాలను తనిఖీ చేశారు. నగరంలోని రిక్కాబజార్, ఎస్ఎఫ్ఎస్ పాఠశాలల్లో జరుగుతున్న టెన్త్ పరీక్షలను ట్రైనీ ఐపీఎస్ అభినాశ్కుమార్తో కలిసి సీపీ విష్ణు తనిఖీ చేసి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. మంగళవారం జరిగిన పరీక్షలో 16,860 మంది విద్యార్థులకు గాను 16,803మంది హాజరై 57 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ తెలిపారు.
టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ప్రశ్నపత్రాలు లీకేజీలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఈవో సోమశేఖరశర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.