మామిళ్లగూడెం, జనవరి 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు అమలుచేసిన రైతుబంధు, రైతుబీమా పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే తీరుపై స్పష్టత ఇవ్వాలని, రైతులకు ఆర్థిక చేయూతనందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ఎజెండా అంశాలుగా సమీక్షించారు. చైర్మన్ కమల్రాజు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల ఆశించిన మేర పంట దిగుమతులు రానందున, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులను కోరారు. వ్యవసాయశాఖ నివేదిక వివరించే క్రమంలో పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు రైతుబంధు, రైతుబీమా అమలుపై రైతులకు వివరించాలని అధికారులను నిలదీశారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి విజయనిర్మల మాట్లాడుతూ ఈ యాసంగి 2023-24కు సంబంధించి 1,66,319 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 39,411 మెట్రిక్ టన్నుల వివిధరకాల ఎరువులను అందుబాటులో ఉంచామన్నారు.
జిల్లాలో మత్స్యశాఖ ఏడీ పనితీరుపై పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాలకు రావాల్సిన ఆదాయం రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల భూముల్లో గిరిజన రైతులు బోర్లు వేసుకునేందుకు అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, ఇతర రైతుల వద్ద లంచాలు తీసుకుని వారిపట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీఎఫ్వో మాట్లాడుతూ ఆరోపణలు వచ్చిన ముగ్గురిని సస్పెండ్ చేశామని, బోర్ల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కోసం నివేదిక పంపించినట్లు తెలిపారు. జిల్లాలో అమలుచేస్తున్న కార్యక్రమాలపై డీఆర్డీవో విద్యాచందన నివేదిక సమర్పించారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసునాయక్ మాట్లాడుతూ అధికారులు రైతుల అవసరాలను గుర్తించి వారికి సహాయసహకారాలు అందించాలన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేంలో జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వీవీ అప్పారావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మాలతి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, మైన్స్శాఖ ఏడీ సంజయ్కుమార్, వివిధశాఖల జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.