ఖమ్మం, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తాము సిలిండర్ పొందుతున్న సంస్థల్లో తప్పనిసరిగా ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏళ్ల నుంచి గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు సిలిండర్లు సరఫరా చేస్తున్నప్పటికీ వినియోగదారుల తాజా వివరాలు రికార్డు చేయడం కోసమే ఈ ఈ-కేవైసీ. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు తమ గ్యాస్ ఏజెన్సీల ద్వారా దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపడుతున్నాయి. ప్రక్రియ పూర్తి చేసేందుకు కొన్ని రోజుల నుంచి వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ఎదుట గంటల కొద్దీ బారులు తీరుతున్నారు. ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేదే అని అధికారులు చెబుతున్నా, అదే తంతు ఇప్పటికీ కొనసాగుతున్నది. ప్రక్రియపై వినియోగదారులకు స్పష్టత, అవగాహన లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందనేది వాస్తవం.
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా..
ఖమ్మం జిల్లాలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,01,640, డబుల్ సిలిండర్ కనెక్షన్లు 78,023, దీపం పథకం కనెక్షన్లు 59,742, సీఎస్సార్ కనెక్షన్లు 23,688, ఉజ్వల కనెక్షన్లు 47,311 ఉండగా గ్యాస్ ఏజెన్సీలు 34 ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో వినియోగదారులు ఈ- కేవైసీ పూర్తయితేనే ఆ సిలిండర్ వస్తుందని భావిస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తిండీ తిప్పలు మానేసి రేషన్, ఆధార్కార్డు, వంటగ్యాస్ కార్డు జిరాక్సులతో ఈ కేవైసీ చేయిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ రాయితీలకు, ఈ కేవైసీకి ఎలాంటి సంబంధం లేదని, ఈ కైవైసీ చేసుకోకపోయినా రాయితీ వర్తిస్తుందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నా ఏజెన్సీల వద్ద రద్దీ తగ్గడం లేదు.
అధికారులు ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కేవైసీపై అవగాహన కల్పిస్తే బాగుంటుందంటున్నారు. వినియోగదారుల ఇబ్బందులు తొలగించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ముందడుగు వేసింది. ఓ మొబైల్ యాప్ రూపొందించింది. యాప్ ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ కేవైసీపై ‘నమస్తే’ జిల్లా ఫౌరసరఫరాల అధికారి శ్రీలతను వివరణ కోరగా.. ‘ఈ కేవైసీ ఎలాంటి గడువు విధించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలకు ఈ కేవైసీకి ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందొద్దు. ఎప్పుడైనా ఈ కేవైసీ చేసుకోవచ్చు..’ అని సమాధానమిచ్చారు.