ఖమ్మం/ ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం టౌన్/ సారపాక/ ఇల్లెందు రూరల్, డిసెంబర్ 24:ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. లోకరక్షకుడు ఏసు ప్రభువు జన్మదిన వేడుకలను ఆదివారం జరుపుకునేందుకు క్రైస్తవులు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా క్రైస్తవ మందిరాలు, చర్చీలు, కాపరుల సంఘాల దేవాలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగులు, విద్యుత్ దీపాల కాంతులతో ప్రార్థన మందిరాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. కొన్ని చర్చీలలో శనివారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభించారు.
కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదినం వచ్చేసింది. గగన వీధిలో ధ్రువతార మెరవగా లోకరక్షకుడు జన్మించెను. క్రిస్మస్ పండుగ తెచ్చెను. ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న చర్చీల్లో క్రైస్తవులు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన చేయనున్నారు. పాస్టర్లు దైవ సందేశమివ్వనున్నారు. ప్రార్థనలకు చర్చీలు ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలంకరణతో కళకళలాడుతున్నాయి. క్రైస్తవులకు ఏడాదిలో ఇదే అతిపెద్ద పండుగ. క్రిస్మస్కు నెల రోజుల ముందు నుంచే సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రైస్ట్, మాస్ అనే పదాల కలయికే క్రిస్మస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ అనే వర్గాలు ఉంటాయి. ప్రొటెస్టెంట్స్ క్రిస్మస్ తెల్లవారుజామున 4 గంటల నుంచి చర్చిల్లో ప్రార్థన చేస్తారు. క్యాథలిక్స్ మాత్రం డిసెంబర్ 24 రాత్రి 11 గంటల నుంచి ఆరాధన ప్రారంభిస్తారు.
పండుగకు ప్రాచుర్యం ఇలా..
రోమ్ సామ్రాజ్యానికి చెందిన తొలి క్రైస్తవ చక్రవర్తి కాన్స్లాంటిన్ క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్గా ప్రకటించారు. అప్పటి నుంచి అక్కడ ఏటా క్రిస్మస్ సంబురాలు జరుగుతున్నాయి. తర్వాత పోప్ జూలియన్ డిసెంబర్ 25ను క్రీస్తు జన్మదినంగా అధికారికంగా ప్రకటించారు. కానీ క్రిస్మస్ను ప్రపంచమంతటికీ పరిచయం చేసిన ఘనత మాత్రం బ్రిటన్కు చెందిన సెయింట్ ఆగస్టీన్కే దక్కుతుంది. ఈయన రోమన్ క్యాలండర్ ఆచరించే పాశ్చాత్య దేశాలన్నింటికీ క్రిస్మస్ను పరిచయం చేశారు. భారతదేశంలో మాత్రం బ్రిటీష్ సామ్రాజ్యాధిపతులు ఇక్కడ మిషనరీలు ఏర్పాటు చేయడంతోనే క్రిస్మస్ వేడుకలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.
పశువుల పాక విశిష్టత ఇదీ..
ఏసుక్రీస్తు పశువులపాకలో జన్మించిన నేపథ్యంలో ఆయన పుట్టినరోజున క్రైస్తవులు చర్చీలు, ఇళ్ల్ల లోగిళ్లలో పశువుల పాక నమూనాలు ఏర్పాటు చేస్తారు. బాలయేసు, మరియ బొమ్మలను ఆ పాకలో ఉంచి ప్రార్థన చేస్తారు.
స్టార్ ప్రత్యేకత ఇదీ..
నేడు విశ్వాసకుల ఇళ్లపై వెలుగుతున్న స్టార్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రీస్తు జన్మించిన వెంటనే ఒక తార ఆకాశంలో వెలిసింది. దీంతో అంధకారంలో ఉన్న ప్రపంచంలో వెలుగులు నిండాయి. క్రైస్తవుల ఆరాధ్య బైబిల్ గ్రంథాన్ని అనుసరించి తూర్పుదేశానికి చెందిన ముగ్గురు జ్ఞానులు ఒక తొక చుక్కని పశ్చిమదిశగా కనుగొంటారు. ఆ చుక్క సరిగ్గా ఇజ్రాయేల్లోని బెత్లహేంలో ఉందని నిర్ధారణకు వస్తారు. మరియ పశువుల పాకలో చిన్నారికి జన్మనివ్వడాన్ని నిర్ధారిస్తారు. అప్పటి నుంచి క్రైస్తవులు తమ ఇళ్లపై ఏటా స్టార్ ఉంచుతారు.
క్రిస్మస్ తాత శాంటాక్లాజ్..
పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ రోజున ఎర్రని దుస్తులు, తెల్లంచు టోపి ధరించి శాంటాక్లాజ్ చిన్నారులకు బహుమతులు ఇస్తారు. ఈయన్నే మనం క్రిస్మస్ తాత అంటాం. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా వస్తున్నది. క్రిస్మస్కు కొద్దిరోజుల ముందు నుంచే క్రైస్తవులు, పాస్టర్లు, యువతీ యువకులు వీధుల్లో క్రీస్తు పాటలు పాడుతూ ఇంటింటికీ వెళ్తారు. చర్చి తరఫున శుభాకాంక్షలు చెప్తారు. ఈ సంప్రదాయాన్నే క్వారల్స్ అని అంటున్నాం.