ఖమ్మం, నవంబర్ 11: కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమాను ఇస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారంటే దానిని పక్కాగా అమలుచేస్తారని తేల్చిచెప్పారు. కానీ గ్యారెంటీ లేని కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ గంగానదిలో కలిసినట్టేనని విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివారం పర్యటించిన ఆయన.. 25, 26, 37, 38 డివిజన్లలో రోడ్షోలు నిర్వహించారు. ముందుగా చర్చికాంపౌండ్ నుంచి ప్రారంభమైన రోడ్షో రిక్కాబజార్, కమాన్బజార్, కస్పాబజార్, పాత మున్సిపల్ కార్యాలయం మీదుగా ఖిల్లాలోకి ప్రవేశించింది. ఆయా వీధుల్లో అజయ్ ఓటర్లను పలకరిస్తూ.. తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకుసాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన అనేక పథకాలను తానే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించానని గుర్తుచేశారు.
అదే సీఎం కేసీఆర్ అందించిన సహకారంతో ఖమ్మం నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని వివరించారు. మనమంతా ఇంతలా కష్టపడి ఎంతో ప్రేమగా సుందరంగా నిర్మించుక్ను ఖమ్మాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టి మళ్లీ ఆగం చేసుకోకూడదని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. అయినా, గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పాలించి కూడా ఖమ్మానికి చేసింది శూన్యమని విమర్శించారు. ఈ నెల 16న ఖమ్మం నగరానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వస్తారని, బీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ పలు డివిజన్లలో ప్రచారం చేస్తారని అన్నారు. అదే రోజు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, ఫాతిమా, ముక్తార్, గోళ్ల చంద్రకళ, వెంకట్, ఆలీయా షౌకత్ అలీ, జహీర్ అలీ, మెహబూబ్ అలీ, ఖమర్, షోకత్ అలీ, పల్లా రాజశేఖర్, ఖమర్, శౌకాత్, మెహబూబ్ అలీ, తాజుద్దీన్, శంశుద్దిన్, ఇసాక్, తౌసిఫ్, అప్సర్, ఫిరోజ్, ఇజ్హార్ తదితరులు పాల్గొన్నారు.