భద్రాద్రి జిల్లాపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. గురువారం ఆయన సీఎస్ శాంతికుమారి, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జడ్పీచైర్మన్ కోరం కనకయ్యతో కలిసి కొత్తగూడెం సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. కలెక్టర్ చాంబర్కు వెళ్లి కలెక్టర్ అనుదీప్ను స్వయంగా సీటులో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. దేశాన్ని రక్షించుకునేందుకు ఈ నెల 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరిస్తున్నదని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులూ సభకు హాజరవుతున్నారన్నారు. ప్రజలందరూ సభకు విచ్చేసి విజయవంతం చేయాలన్నారు. బీఆర్ఎస్కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.
ఖమ్మం, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాద్రి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం ఆయన మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కొత్తగూడెం సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సభలో మాట్లాడారు. కొత్తగూడెంలో మొర్రేడు వాగు వరదల సమస్యకు ప్రహరీ నిర్మించి పరిష్కారం చూపాలని అక్కడికక్కడే ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జిల్లాలో తలాపునే గోదావరి పారుతున్నా తాగునీరు సక్రమంగా అందక ప్రజలు ఇబ్బందిపడేవారన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పుడు మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నదన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి జిల్లాలోని ప్రతి అంగుళానికి నీరందుతుందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లల వివాహాలకు సాయం అందుతున్నదన్నారు. లబ్ధిదారుల ఖాతా లో నెలనెలా ఠంచనుగా ఆసరా పింఛను జమ అవుతున్నదన్నా రు. రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు రేషన్ అందుతున్నదన్నారు. రాజకీయ చైతన్యం గల జిల్లా భద్రాద్రి అని కొనియాడారు.
ఉమ్మడి జిల్లాతో అనుబంధం..
నాడు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మానికి తీసుకొస్తే ప్రజలు కడుపులోపెట్టుకుని చూసుకున్నారని సీఎం కేసీఆర్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక్కడి ప్రజలు తమ చైతన్యమేమిటో చూపించారని కొనియాడారు. వామపక్ష భావజాలం , రాజకీయ చైతన్యం కలిగిన ప్రజలు భద్రాద్రి జిల్లావాసులన్నారు. ప్రజాశీర్వాదంతోనే స్వరాష్ట్రం సాధ్యమైందన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు పోరాడారన్నారు. తెలంగాణ వచ్చాక కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లా ఏర్పాటైందన్నారు. కొత్త జిల్లాలో మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చాయన్నారు.
ఖమ్మం నుంచే శంఖారావం..
దేశాన్ని రక్షించుకునేందుకు ఈ నెల 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. దీనిలో భాగంగానే ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులూ సభకు హాజరవుతున్నారన్నారు. ప్రజలందరూ సభకు విచ్చేసి విజయవంతం చేయాలన్నారు. బీఆర్ఎస్కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..
సమీకృత కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ కలెక్టరేట్ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ చాంబర్కు వెళ్లి కలెక్టర్ అనుదీప్ను స్వయంగా సీటులో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట ప్రభుత్వ సీఎస్ శాంతకుమారి, మంత్రులు అజయ్కుమార్, ప్రశాంత్రెడ్డి తదితరులున్నారు.
బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం..
బహిరంగ సభ అనంతరం సీఎం కేసీఆర్ ఆధునిక హంగులతో కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును స్వయంగా అధ్యక్షుడి సీటులో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పర్యటన సాగిందిలా..
ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి 3.30 గంటలకు కొత్తగూడెంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో హెలీప్యాడ్లో ల్యాండ్ అయ్యారు. అనంతరం రాష్ట్ర మంత్రులతో కలిసి నేరుగా కలెక్టరేట్లోకి వెళ్లి శాస్ర్తోక్తంగా కలెక్టరేట్ను ప్రారంభించారు. వేద మంత్రోచ్ఛారణ నడుమ లాంఛనంగా కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాలువాతో సత్కరించారు. మంత్రులు అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. సభా సమయానికి సుమారు రెండు గంటల ముందే సభావేదిక వద్దకు చేరుకున్నారు. సీఎం వేదిక పైకి చేరుకున్న తర్వాత ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భద్రాద్రి జిల్లాకు వరాల జల్లు కురిపిస్తున్నప్పుడు కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
కేంద్రంపై మండిపాటు..
రాష్ర్టాభివృద్ధికి సీఎంగా తాను నిరంతరం శ్రమిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదన్నారు. ప్రజల్లో మతచిచ్చు పెడుతున్నదని మండిపడ్డారు. బీజేపీ ధోరణిని గ్రామాల్లో ఎండగట్టాలని సూచించారు. ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్లు బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. గ్రామాల్లో చర్చ జరగాల్సిందేనన్నారు. ప్రపంచంలో వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన భూమి ఉన్న దేశం భారతదేశం మాత్రమేనని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాకు చెందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు తక్షణం మంజూరు చేస్తున్నామన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. జర్నలిస్టులు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జిల్లాలో జరిగిన అభివృద్ధిని, గతంలో ప్రజల కష్టాలను బేరీజు వేసి గ్రామగ్రామాన ప్రచారం చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగట్టాలని కోరారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పాల్గొన్నారు.