హరితహారం మొక్కలకు కేరాఫ్ చేగొమ్మ నర్సరీ
జిల్లాలో ఏకైక ప్రభుత్వ ఉద్యాన వనం
ఎన్హెచ్బీ గుర్తింపు పొందిన నర్సరీ ఇదీ..
తక్కువ ధరకే మొక్కల పంపిణీ..
రైతు శిక్షణకూ కేంద్రం
కూసుమంచి రూరల్, జూన్ 18 : కూసుమంచి మండలంలోని చేగొమ్మలో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఉద్యాన నర్సరీ లక్ష్యాలను అధిగమించి రైతులకు సేవలందిస్తున్నది. నాణ్యమైన పండ్ల మొక్కల సరఫరాలో ఇటీవల జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడ మామిడి, జామ, సపోట, నిమ్మ, కొబ్బరి, మల్బరీ వంటి మొక్కల పెంపకం జరుగుతున్నది. ఇక్కడ అడిగిన వారికి తక్కువ ధరలకే మొక్కలు దొరకుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న మూడు ఉద్యానశాఖ నర్సరీలు విభజనలో భద్రాద్రి జిల్లా పరిధిలోకే వెళ్లాయి. ఖమ్మం జిల్లాలో నర్సరీ ఏర్పాటుకు 2017లో తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
ప్రభుత్వం అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మండల పరిధిలోని చేగొమ్మలోని 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉద్యానశాఖకు అప్పగించింది. గత ఏడేళ్లలో ఉద్యానశాఖ లక్ష్యాలను అధిగమించి రైతులకు సేవలందిస్తున్నది. వనంలో మామిడి, కొబ్బరి, నిమ్మ, సపోటా, జామ తోటలతో పాటు, కూరగాయల పెరుగుతున్నది. వనంలో రైతులకు శిక్షణ ఇవ్వడానికి హాల్ అందుబాటులోకి వచ్చింది. జాతీయ స్థాయి గుర్తింపు కోసం ఇప్పటికే ఉద్యానశాఖ అధికారులు నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్హెచ్బీ) కి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎన్హెచ్బీ నాయకులు వనంలో ఉత్పత్తులు, మొక్కలను పరిశీలించారు. వనానికి జాతీయస్థాయి గుర్తింపు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఇక్కడ పెరిగిన మొక్కలు, ఉత్పత్తులకు జాతీయస్థాయి గుర్తింపు లభించడంతో మొక్కల కొనుగోలుకు ఆర్డర్లు పెరిగాయి.
హరితహారానికి వేలాది మొక్కలు..
హరితహారం కార్యక్రమానికి ఏటా ఇక్కడి నుంచి వేలాది మొక్కలు సరఫరా అవుతున్నాయి. జిల్లాతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, గజ్వేల్, నల్గొండ తదితర జిల్లాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు మొక్కలు అందుతున్నాయి. 2017-18లో 25 వేల మొక్కలు, 2018-19లో 27 వేలు, 2019-20లో 18 వేలు, 2020-21లో 22 వేల మొక్కలు ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. ఈ వనంలో తోతాపురి, బంగినపల్లి, హిమాయత్ మామిడి రకాల మొక్కలు దొరుకుతున్నాయి. తల్లి మొక్కల నుంచి అంటు తీసి ఇక్కడి సిబ్బంది నాణ్యమైన మొక్కలు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు నాణ్యమైన కొబ్బరి, శ్రీగంధం, జామ, సపోట, నిమ్మ మొక్కలూ అందుబాటులో ఉన్నాయి.
రైతులకు అండగా ఉద్యానశాఖ
ప్రభుత్వం ఉద్యాన రైతులను ప్రోత్సహిస్తున్నది. చేగొమ్మలో నర్సరీ ఏర్పాటయ్యాక రైతులకు హర్టీకల్చర్పై అవగాహన పెరిగింది. ఇక్కడ శిక్షణ పొందిన కొందరు రైతులు సొంతంగా నర్సరీలు ఏర్పాటు చేశారు. స్వయంగా మొక్కలు పెంచి విక్రయిస్తున్నారు. లోక్యాతండా, పాలేరు, గురువాయిగూడెం గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ నర్సరీలు ఏర్పాటయ్యాయి. చేగొమ్మ నర్సరీలో నాణ్యమైన మొక్కలు పెంచి తక్కువ ధరకే మొక్కలు విక్రయిస్తున్నాం.
– జి.నగేశ్, ఉద్యానశాఖ అధికారి, చేగొమ్మ నర్సరీ