విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై భారం వేయాలని చూస్తున్నదని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని గురువారం ఆయన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ప్రారంభించారు. కోనాయిగూడెం- నాచేపల్లి బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మంలోని శాంతినగర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నయాబజార్ కళాశాల గ్రౌండ్, గట్టయ్య సెంటర్ ఫ్రీడమ్ పార్క్లో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
ఖమ్మం, నేలకొండపల్లి, సెప్టెంబర్ 22: విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై భారం వేయాలని చూస్తున్నదని, ఇందుకోసం అన్నదాతల వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లను పెట్టాలని రాష్ట్రంపై ఒత్తిడి తెస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అదే విధంగా మండలంలోని కోనాయిగూడెం – నాచేపల్లి బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముజ్జుగూడెంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంతకుమునుపు ఏడు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేదని, తెలంగాణ ఆవిర్భవించాక అది 17 వేల మెగావాట్లకు చేరిందని అన్నారు. యాదాద్రితోపాటు మరికొని విద్యుత్ కేంద్రాలు పూర్తయితే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం 24 వేల మెగావాట్లకు చేరుకుంటుందని అన్నారు.
సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే విద్యుత్ శాఖలోని దాదాపు ఇరవై లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కచ్చితంగా విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తే భవిష్యత్తులో ఉచిత విద్యుత్ ఇచ్చే అవకాశం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి పన్నులు తీసుకెళ్తున్న కేంద్రం.. రాష్ర్టానికి మాత్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఇతర ప్రజాప్రతినిధులు నల్లమల వెంకటేశ్వరరావు, మరికంటి ధనలక్ష్మి, వజ్జా రమ్య, నాగుబండి శ్రీనివాసరావు, ఉన్నం బ్రహ్మయ్య, నెల్లూరి లీలాప్రసాద్, శాఖమూరి సతీశ్, మేళ్లచెరువు అరుణకుమారి, శీలం వెంకటలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.