సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 10: సీసీసీ సింగరేణి ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల మహా సమ్మేళానికి అంతా సిద్ధమైంది. పాఠశాలకు చెం దిన పూర్వ విద్యార్థులు కొందరు ఆరు నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు. ముందుగా కుటుంబ యాప్ను తయారు చేసి, దాని ద్వారా పూర్వ విద్యార్థుల వివరాలను సేకరించారు. కోఆర్డినేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ఐదుసార్లు సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమం, విధి విధానాలు, నిర్వహణ, లక్ష్యాల పూర్తి, తదితర అంశాలపై చర్చించారు. ఒక్కో బ్యాచ్కు ఇద్దరు చొప్పున కోఆర్డినేటర్లను నియమించారు. పకడ్బందీ ప్రణాళికతో ఆయా బ్యాచ్ల్లోని విద్యార్థుల వివరాలు, విరాళాల సేకరణ చేపట్టారు.
సింగరేణి యాజమాన్యం కార్మికుల పిల్లలకు విద్యనందించేందుకు 1978లో సీసీసీ టౌన్షిప్లో పాఠశాలను ఏర్పాటు చేయగా, 44 ఏండ్లు పూర్తయింది. పాఠశాల ప్రారంభం నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు 70బ్యాచ్లకు చెందిన విద్యార్థులు మహా సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 3500 మంది పూర్వ విద్యార్థులు, 200 మంది ప్రస్తుతం, పూర్వపు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది హాజరు కానున్నారు. ఐడీ కార్డులు ఉన్న వారిని మాత్రమే సభ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫోర్, టూ వీలర్స్కు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సమ్మేళనానికి వచ్చే వారికి టిఫిన్స్, భోజనం, తాగునీరు సౌకర్యం కల్పించారు. సభ ప్రాంగణంలో నాలుగు మూలల మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు.
మహా సమ్మేళనం ఉదయం 8 నుంచి రాత్రి 7గంటల దాకా కొనసాగనుంది. ముందుగా పరిచయాలు, ప్రస్తావన, నివేదికలు, పెద్దల ఉపన్యాసాలు, సన్మాన సత్కారాలు, అధ్యక్షోపన్యాసాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు విజయగాథలు, పాఠశాల ప్రత్యేకతలు, తదితర అంశాలతో ముద్రించిన సావనీర్ ఆవిష్కరిస్తారు. పూర్వ, ప్రస్తుత విద్యార్థులను ఆదుకునేందుకు ఏర్పాటు చేస్తున్న చారిటబుల్ ట్రస్టును అతిథులచే ప్రారంభిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. భోజన విరామం అనంతరం పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల అనుభూతులు, అనుభవాల వెల్లడి, మిత్రులు, టీచర్ల యోగక్షేమాలు, వారి స్థితిగతులపై తెలుసుకోనున్నారు.
ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి ఈ మహా సమ్మేళనం ఏర్పాటు చేశాం. 44 ఏండ్ల తర్వాత జరుగుతున్న తొలి అతిపెద్ద మహా సమ్మేళన వేడుక. పాఠశాల, సింగరేణి సంస్థ గౌరవం పెంచేలా అందరూ క్రమశిక్షణ పాటించాలి. కోఆర్డినేటర్ల సమావేశంలో చర్చించి నిర్ణయించిన తీర్మానాల ప్రకారం సమ్మేళనం కొనసాగుతుంది. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలి.
-రాజారెడ్డి, ప్రోగ్రాం సమన్వయకర్త
నేను సీసీసీ సింగరేణి పాఠశాలలో పనిచేసి విరమణ పొందా. బ్యాచ్ల ప్రకారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు చూసిన.. కానీ, ఇలా మహా సమ్మేళనం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం మొదటి సారిగా చూస్తున్న. టీచర్లు, బోధనేతర సిబ్బందిని ఆహ్వానించి గౌరవిస్తుండడం సంతోషంగా ఉంది. పూర్వపు ఉపాధ్యాయులంతా తప్పకుండా హాజరుకావాలి. పూర్వ విద్యార్థులను ఆదుకునేందుకు ట్రస్టు ఏర్పాటు గొప్పవిషయం.
-జనార్దన్రావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు