కారేపల్లి, ఏప్రిల్ 04 : సింగరేణి మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ చీమలవారిగూడెంలో సోమవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ఈసం మోతీ వీరస్వామి, సంత ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య ప్రారంభిచారు. రేగులగూడెం గ్రామ పంచాయతీ అభివృద్ధికి గాను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి రూ.20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పంచాయతీలోని శివారు గ్రామాలలోని వీధులను సీసీ రోడ్లుగా మార్చడం జరుగుతుందన్నారు. గేటుకారేపల్లి రైల్వే గేటు నుండి అనంతారం గ్రామం వరకు గల రహదారి కంకర తేలి గత కొన్ని ఎండ్లుగా 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దానిని బీటీగా మార్చడానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రూ.20 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెద్దబోయిన వెంకటనర్సయ్య, చీమల లక్ష్మి, చెవుల భద్రయ్య, ఆవుల శ్రీను పాల్గొన్నారు.