ఖమ్మం, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న మున్నూరుకాపులను అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రాజకీయ కక్షతో అణచివేయాలని చూస్తోందని ఖమ్మం జిల్లాకు చెందిన మున్నూరుకాపు సంఘం నాయకులు, ఆ సంఘానికి చెందిన ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. మున్నూరుకాపుల జోలికొస్తే ఊరుకోబోమని హచ్చరించారు. ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ మాట్లాడారు. మున్నూరుకాపు కులానికి చెందిన తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ అధికారులతో దాడులు చేయించడం హేయమైన చర్య అని అన్నారు. మంత్రి ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తాళాలు పగులగొట్టి మరీ లోపలికి చొరబడి దాడులు చేయడం ఏమి ప్రజాస్వామిక పద్ధతి అని ప్రశ్నించారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండానే మంత్రి ఇంట్లో దాడులు చేస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర కార్యాలయాలపైనా ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేయడం కూడా రాజకీయ కక్షేనని ధ్వజమెత్తారు.
రాష్ర్టానికి చెందిన కొద్దిమంది బీజేపీ నాయకులు ఢిల్లీలో కూర్చొని తెలంగాణలోని మున్నూరుకాపులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇదే కులానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన దొంగలను దేశం దాటిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. బీసీ నాయకులను, ప్రజాప్రతినిధులను వేధించడం సరికాదని అన్నారు. చిన్న చిన్న పరిశ్రమలను నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ నిరుపేదలకు అండగా ఉంటున్న వద్దిరాజు రవిచంద్ర లాంటి వారిపై దాడులు చేయడం నీతిమాలిన చర్య అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమిని జీర్ణించుకోలేకనే బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఈ దాడులను ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరుకాపులు ఆందోళనలకు దిగుతారని హెచ్చరించారు. సమావేశంలో మున్నూరుకాపు సంఘం నాయకులు ఆకుల గాంధీ, శీలంశెట్టి వీరభద్రం, రాపర్తి శరత్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.