టేకులపల్లి, మార్చి 21 : మండల కేంద్రంలోని మూడు వైన్ షాపుల్లోకి చొరబడి మద్యం సీసాలు ఎత్తుకెళ్లిన 51 మందిపై కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి సీఐ టి.సురేశ్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గణేశ్ మద్యం షాపు బాధ్యుడు రూ.9,68,595 విలువ కలిగిన మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొనగా.. సీసీ ఫుటేజీల ఆధారంగా 16 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. క్రాంతి మద్యం షాపు బాధ్యుడు ఎస్.సురేశ్ రూ.5.45 లక్షల విలువైన మద్యం సీసాలు పోయినట్లు ఫిర్యాదు చేయగా..
దుకాణంలోని సీసీ ఫుటేజీల ఆధారంగా 20 మందిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పల్లవి మద్యం దుకాణం బాధ్యుడు డి.బాలాజీ రూ.68 వేల విలులైన మద్య సీసాలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేయగా.. 15 మందిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా.. బుధవారం రాత్రి మద్యం దుకాణాలను లూటీ చేసి సీసాలు ఎత్తుకెళ్లిన వ్యక్తులు స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఇవ్వాలని సీఐ విజ్ఞప్తి చేయగా.. గురువారం రేగులతండాకు చెందిన పలువురు మద్యం సీసాలను తీసుకొచ్చి మద్యం షాపు ముందు పెట్టి వెళ్లిపోయారు.