మధిర, మార్చి 12: కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. తాజాగా ఆ రైలులో గంజాయి తరలుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం మధిర ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్, జీఆర్పీ పోలీసులు మధిరలో తనిఖీలు నిర్వహించి 64 కేజీల సరుకును పట్టుకున్నారు. మధిర ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్తున్న ఆ రైలులో ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్, రైల్వే పోలీసులు జనరల్ కాంపార్ట్మెంట్లో తనిఖీలు చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని బ్యాగులను ఆ రైలులో నుంచి బయటకు విసిరివేసి పారిపోయారు. పోలీసులు ఆ బ్యాగులను స్వాధీనం చేసుకొని పరిశీలించగా 36 ప్యాకెట్లలో 64 కిలోల ఎండు గంజాయి ఉంది. దీని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుంది.
శనివారం కూడా ఇదే కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో గుర్తుతెలియని వ్యక్తులు గంజాయిను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సరఫరా చేస్తున్న వారి ఆచూకీ లభ్యంకాలేదు. స్వాధీంన చేసుకున్న గంజాయికి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎక్సైజ్ ఎస్సై చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ ఎస్సై అచ్చారావు, రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్రెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది ఖాసీం, లాలు, గోపయ్య, వలరాజు, రియాజ్, లాజర్, తదితరులు పాల్గొన్నారు.