ఎక్కడ చూసినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదనే చర్చ.. ఏ ఇద్దరు కలిసినా.. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీ పరాభవం ఎదుర్కోనున్నది.. అనే అంశాలపైనే సంభాషణ. ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. పందెంరాయుళ్లు మాత్రం ఎన్నికల ఫలితాలనూ బెట్టింగ్కు వినియోగించుకుంటున్నారు. ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది.. ఏ నియోజకవర్గంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది.. అన్న అంశాలపై ఉభయ జిల్లాల పరిధిలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలైన జగ్గయ్యపేట, తిరువూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, గోపాలపురం వంటి ప్రాంతాల్లోనూ బెట్టింగ్ జరుగుతుండడం గమనార్హం.
ఖమ్మం, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. పందెంరాయుళ్లు మాత్రం ఎన్నికల ఫలితాలనూ బెట్టింగ్కు వినియోగించుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారు.. ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది.. ఏ నియోజకవర్గంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది.. అన్న అంశాలపై ఉభయ జిల్లాల పరిధిలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయంపైనే ఎక్కువ మంది పందేలు కాస్తున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలైన జగ్గయ్యపేట, తిరువూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, గోపాలపురం వంటి ప్రాంతాల్లోనూ బెట్టింగ్ జరుగుతుండడం గమనార్హం. ఏలూరుకు చెందిన ఒక వ్యక్తి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని రూ.20 లక్షలు పందెం వేయగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు లభించే సీట్లలో కనీసం పది సీట్లు తేడా ఉంటుందని, బీఆర్ఎస్కే అధికంగా వస్తాయని కొందరు లక్షల్లో పందేలు కాశారు.
పార్టీల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? అన్న విషయమై రూ.కోట్లలో పందేలు జరుగుతున్నాయి. ఖమ్మం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విజయం సాధిస్తారని ఎక్కువ మంది కాన్ఫిడెంట్గా పందెం కాస్తున్నట్లు తెలుస్తున్నది. పాలేరు అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి, సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, మధిర అభ్యర్థి లింగాల కమల్రాజు, వైరా అభ్యర్థి మదన్లాల్, పినపాక అభ్యర్థి రేగా కాంతారావు, కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు అభ్యర్థి హరిప్రియానాయక్ విజయంపైనా నియోజకవర్గాల్లో పందేలు నడుస్తున్నాయి.
ఒక్కో పందెం రూ.10 వేల నుంచి మొదలై రూ.50 లక్షల వరకు జరుగుతున్నట్లు సమాచారం. బీజేపీకి ఏడు సీట్లు దాటవని ఓ వ్యక్తి ఏకంగా రూ.10 లక్షలు పందెం కాయగా, జనసేనకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఓట్లపై మరో వ్యక్తి పందెం కాశాడు. కొత్తగూడెం నుంచి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జలగం వెంకట్రావుకు ఎన్ని ఓట్లు వస్తాయన్న అంశంపై సత్తుపల్లి, కొత్తగూడెంలో జోరుగా పందేలు నడుస్తున్నాయి. పందెం డబ్బులను మధ్యవర్తి వద్ద పెట్టి నోటు రాయించుకోవడం గమనార్హం. సాధారణ కార్యకర్త నుంచి నాయకుల వరకు, వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు.. ఎంతోమంది పందేలు కాస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటే.. తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారని కూడా పందేలు జరుగుతున్నాయి. పెద్దమొత్తంలో పందెం కాసే వారు ఓటింగ్ సరళి, పోలింగ్శాతం, పోలైన ఓట్ల వంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేసి మరీ పందెం కాస్తున్నారు.