రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం రాకముందు రైతులు పడిన గోస అంతాఇంతా కాదు. పంట వేసే దగ్గర నుంచి పంటను అమ్ముకునే వరకు అన్నీ కష్టాలే. అండగా ఉండాల్సిన ప్రభుత్వాల చేతకానితనంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడారు. అయితే ఇప్పుడా పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. రైతుల ఆర్తనాదాలు పోయాయి. హర్షధ్వానాలే వినిపిస్తున్నాయి. సీజన్ ప్రారంభం కాకముందే పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే విత్తనాలు సరిపడా అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం గోడౌన్లలో అన్నిరకాల ఎరువులు కలిపి 56,629 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉన్నాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా అధికారులు గట్టి నిఘా కూడా పెట్టారు. పీవోఎస్ యంత్రాల సాయంతో మాత్రమే ఎరువుల అమ్మకాలు చేపట్టను న్నారు. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం సీజన్లో ఏ ఒక్క రైతుకు కూడా ఎరువుల ఇబ్బంది రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. గత నెలరోజులుగా ప్రత్యేక వ్యాగన్ల ద్వారా వస్తున్న ఎరువులను మార్క్ఫెడ్ అధికారులు దిగుమతి చేసుకుంటూ జిల్లా కేంద్రంతోపాటు, సమీప మండలాల్లో ఉన్న వేర్హౌస్ గోడౌన్లలో నిల్వ చేస్తున్నారు. గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమిస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టారు. సాగు విస్తీర్ణానికి సరిపడా ఎరువులను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక ప్రకారం నిల్వ చేస్తున్నారు. మార్క్ఫెడ్ నివేదిక ఆధారంగా సరిపడా ఎరువులను సిద్ధంగా ఉంచారు. వానకాలం ఏ నెలలో ఎంత మొత్తం ఎరువులు అవసరం ఉంటాయో గుర్తించిన అధికారులు రెండు, మూడు నెలలకు సరిపడా ఎరువులను ఇప్పటికే జిల్లాకేంద్రంలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం సొసైటీల గోడౌన్ల్లో సరిపడా విత్తనాలు నిల్వ ఉన్నాయి. సొసైటీల అభ్యర్థన మేరకు రెండు, మూడురోజుల నుంచి ఎరువులను సొసైటీలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితిలోనూ యూరియా కొరత లేకుండా వ్యవసాయశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై నిఘా పెట్టారు. ఎరువుల అమ్మకాలు పూర్తిగా పీవోఎస్ యంత్రాల సాయంతో జరిగేలా చూడాలని ఆయా వ్యవసాయశాఖ మండల అధికారులకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఎరువుల అమ్మకాలు జరగాలని పేర్కొన్నారు. ఒక్క రైతుకు సైతం ఎరువుల కొరత రావొద్దని ఆదేశించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ విస్తరణ అధికారుల నుంచి సంబంధిత అధికారులు నివేదికలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం జిల్లాలో నిల్వలు ఇలా..
జిల్లా వ్యవసాయశాఖ అధికారుల గణంకాల ప్రకారం ప్రస్తుతం గోడౌన్లలో అన్నిరకాల ఎరువులు కలిపి 56,629 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో యూరియా 19,839 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6,334 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 1,521 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 21,326 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1,607 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ డీలర్ల వద్ద నిల్వలకు సంబంధించి యూరియా 6,652 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,164 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 761 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 9,510 మెట్రిక్ టన్నులతోపాటు ఎస్ఎస్పీ మరో 1,291 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. మార్క్ఫెడ్ ఆధీనంలో యూరియా 8,800 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,010 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు మరో 2,677 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎరువులను తెప్పించే విధంగా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. నిల్వ చేసిన ఎరువుల విషయంలో సైతం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి సంబంధిత అధికారులతో కలిసి గోడౌన్లలోని ఎరువుల నాణ్యతను పరిశీలించారు.
సరిపడా ఎరువులను నిల్వ ఉంచాం..
ఒక్క రైతుకు కూడా ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముందస్తుగానే జిల్లాకేంద్రం, ఇతర గోడౌన్లలో ఎరువులను నిల్వ ఉంచాం. నెలవారీగా ఏఏ రకం ఎరువులు ఎంత అవసరం ఉంటుంది అంచనా వేశాం. ముఖ్యంగా యూరియా కొరత రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం సొసైటీలో విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఎరువులను సైతం సొసైటీలకు తరలిస్తున్నాం. కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిఘా పెట్టాం. ఎరువులను విక్రయించే ప్రతి సంస్థ, డీలర్లు పీవోఎస్ యంత్రాల సాయంతో క్రయవిక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది.
– ఎం.విజయనిర్మల, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, ఖమ్మం