ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా.. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు కూడా గెలిచారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపొందారు. ఖమ్మం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఖమ్మం రూరల్ మండల పరిధిలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల లెక్కింపు పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. తొలుత ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఒక్క ఖమ్మం నియోజకవర్గంలోనే 5 వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉండడంతో మధ్యాహ్నం వరకు సిబ్బంది వాటినే లెక్కించారు. సాధారణ ఓట్ల లెక్కింపులో ఒక్క రౌండ్ మినహా దాదాపు అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యత కొనసాగింది.
ఖమ్మం, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పది నియోజకవర్గాల పరిధిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలిచారు. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపొందారు. మిగిలిన ఎన్నిమిది స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీదే విజయం. ఖమ్మం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు రూరల్ మండల పరిధిలోని శ్రీచైతన్య కళాశాలలో జరిగింది. భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల లెక్కింపు పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. తొలుత సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు ఆధిక్యత లభించింది. సాధారణ ఓట్ల లెక్కింపులో ఒక్క రౌండ్ మినహా దాదాపు అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యత కొనసాగింది.
ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్పై 49,381 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పాలేరు నియోజకవర్గంలో 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డిపై 56,478 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మధిరలో 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజుపై 35,452 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైరా నియోజకవర్గంలో 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాలోతు రాందాస్ నాయక్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్లాల్పై 33,045 ఓట్ల మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. సత్తుపల్లిలో 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మట్టా రాగమయి తన సమీప బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యపై 19,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
భద్రాచలంలో 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు తన సమీప కాంగ్రెస్ పార్టీ పొదెం వీరయ్యపై 5,719 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇల్లెందు నియోజకవర్గంలో 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరం కనకయ్య తన సమీప బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు హరిప్రియానాయక్పై 57,309 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 18 రౌండ్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబశివరావు తన సమీప ఆల్ ఇండియా ఫార్వాడ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావుపై 26,547 ఓట్ల మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారె ఆదినారాయణ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 28,905 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పినపాక నియోజకవర్గంలో 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుపై 34,506 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని పాలేరు నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలుపొందిన వారిలో మొదటివారు, ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య రెండోవారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 3వ స్థానంలో నిలిచారు. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టే వారిలో వైరా నుంచి మాలోతు రాందాస్ నాయక్, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణ, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అడుగు పెట్టనున్నారు. ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచిన అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వయస్సులో పెద్దవారు కాగా అశ్వారావుపేట నుంచి గెలిచిన జారె ఆదినారాయణ పిన్న వయస్కులు. గెలుపొందిన అభ్యర్థులు ఆయా రిటర్నింగ్ అధికారుల నుంచి ఎమ్మెల్యేలుగా ధ్రువపత్రాలను అందుకున్నారు.
ప్రజల ఆకాంక్షలను
ఓట్ల లెక్కింపు అనంతరం గెలిచిన మధిర, పాలేరు అభ్యర్థులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారని, వారి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పార్టీ పనిచేస్తుందన్నారు. అన్నివర్గాల ప్రజల కష్టాలను తీర్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సీఎం ఎవరవుతారనే అంశాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నిన్న మొన్నటి వరకు ప్రచారంలో ‘నువ్వా..నేనా..?’ అని సవాల్ విసురుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రంలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి పక్కనే ఒకరు కూర్చొని కౌంటింగ్ సరళిని పరిశీలించారు. ఇక ఓడిపోతాం అని భావించిన అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. గెలుపొందిన అభ్యర్థులు బయటకు వెళ్లి కార్యకర్తలు, అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ ప్రియాంక ఆల పరిశీలించారు. మీడియా సెంటర్లో డీపీఆర్వో శ్రీనివాసరావు మీడియాకు అవసరమైన సమాచారాన్ని అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రాద్రి ఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.