తల్లాడ, నవంబర్ 7: రూ.వెయ్యి కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులు చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ పదేళ్లలోనే చేసి చూపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలపై ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు. తల్లాడ పట్టణంలో మంగళవారం పర్యటించిన ఆయన.. ప్రతి ఇంటికీ, ప్రతి షాపునకూ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలు అభిమానాన్ని, ప్రేమను పొందుతున్నానని అన్నారు. ఈ క్రమంలో మూడుసార్లు తనను సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. మీ నమ్మకాన్ని తగినట్లుగానే సత్తుపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించానని వివరించారు.
సీఎం కేసీఆర్ సహకారంతోనే రూ.వెయ్యి కోట్ల నిధులు తెచ్చి సత్తుపల్లి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దానని అన్నారు. నియోజకవర్గ ప్రజలే తన బలమని, బలగమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో తాను చేసిన అభివృద్ధిని గమనించి నాలుగోసారి కూడా తనను ఆశీర్వదించాలని కోరారు. అలాగే, రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. వాటితో రైతులు వ్యవసాయాన్ని పండుగల చేస్తున్నారని వివరించారు. అందుకని ఇలాంటి పథకాలు అందిస్తున్న కేసీఆర్ను కూడా మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, దూపాటి భద్రరాజు, దుగ్గిదేవర వెంకట్లాల్, కోడూరి వీరకృష్ణ, దిరిశాల దాసురావు, కేతినేని చలపతిరావు, బద్ధం కోటిరెడ్డి, నాయుడు శ్రీనివాసరావు, కాంపాటి జమలయ్య, దగ్గుల రాజశేఖర్రెడ్డి, జీవీఆర్, గుండ్ల వెంకటి, గుండ్ల నాగయ్య, ఆదూరి వెంకటేశ్వరరావు, కోపెల కనకయ్య, శీలం కోటారెడ్డి, జొన్నలగడ్డ కిరణ్బాబు, అయిలూరి శివారెడ్డి, వరపర్ల ఉదయ్, పోతురాజు వెంకటయ్య, ఎక్కిరాల సుదర్శన్, దూపాటి నరేశ్రాజు, శీలం శ్రీనివాసరెడ్డి, పమ్మి కృష్ణారావు, సంఘసాని శ్రీనివాసరావు, మహేశ్, శివ పాల్గొన్నారు.