ఖమ్మం, నవంబర్ 18 : ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అహర్నిశలూ శ్రమించానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఖమ్మం మొత్తాన్ని ఒకే మాదిరిగా తీర్చిదిద్దానని స్పష్టం చేశారు. అభివృద్ధి కాముకుడిని కాబట్టే కాలుకు బలపం కట్టుకొని మరీ నగరంలో తిరిగానని అన్నారు. కష్టనష్టాల్లో తోడునీడగా నిలుచిందెవరో ఖమ్మం ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ఖమ్మం ప్రజల సుఖదుఖ్ఖాల్లో ఏనాడూ లేని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం ప్రజల ఓట్లు కావాలంట అని విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివారం పర్యటించిన ఆయన.. 16, 17, 27 డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఇన్నేళ్లలో ఏనాడైనా ఖమ్మం వైపుగానీ, అందులో ఉన్న శ్రీనివాసనగర్ వైపుగానీ కన్నెత్తయినా చూశారా? అని ప్రశ్నించారు.
ఇక్కడి పెళ్లిలోనూ, చావులోనూ లేరని, మున్నేరు వరదలప్పుడూ లేరని, చివరికి కరోనా సమయంలోనూ కన్పించలేదని దుయ్యబట్టారు. ప్రజల సుఖదుఖ్ఖాల్లో ఏనాడూ కన్పించని తుమ్మలకు ఇప్పుడు ఖమ్మం ప్రజల ఓట్లు ఎందుకని ప్రశ్నించారు. ‘పాలేరులో టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఖమ్మంలో టికెట్ ఇవ్వాలంటడు. సత్తుపల్లిలో ఓడిపోతే ఖమ్మం వస్తాడు. ఖమ్మంలో ఓడిపోతే పాలేరు వెళ్తాడు. పాలేరులో ఓడిపోతే మళ్లీ ఖమ్మం వచ్చాడు..’ అంటూ ధ్వజమెత్తారు. మట్టి తెచ్చేందుకైనా ఇంటోడు వెళ్లాలంటూ పెద్దలంటుంటారని గుర్తుచేశారు. ఆ ప్రకారమే ఖమ్మం ఇంటివాడినైన తనను మరోసారి ఆదరించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్జేసీ కృష్ణ, ధనాల రాధ, పాలడుగు పాపారావు, రామకృష్ణ, ధనాల శ్రీకాంత్, నున్నా మాధవరావు, మెంతుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.