ఖమ్మం, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు తథ్యమని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం సోమవారం రాత్రి నిర్వహించిన బస్సు యాత్ర, రోడ్ షో అనంతరం పార్టీ జిల్లా నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలన్నీ నామా నాగేశ్వరరావుకు అనుకూలంగా వస్తున్నాయని అన్నారు. మిగతా పార్టీ అభ్యర్థుల కంటే బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ముందంజలో ఉన్నట్లు చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత కష్టపడి పని చేస్తే అత్యధిక మెజారిటీ తథ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ సునామీ ఖాయమన్నారు. మొత్తం 12 సీట్లలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.