ఖమ్మం, మే 2: ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరమూ కంకణబద్ధులమై పనిచేద్దామని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసంపై ప్రజలు పునరాలోచన చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకూ వెళ్లి కాంగ్రెస్ మోసాన్ని వివరించాలని, ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఖమ్మం స్థానంలో అధిక మెజార్టీ సాధించేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాలని కోరారు. ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన ఖమ్మం టూ టౌన్ ఏరియా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమయం తకువగా ఉన్నందున అందరమూ కలిసి కష్టపడి పని చేద్దామని అన్నారు. జిల్లాలో పార్టీ అధినేత కేసీఆర్ సభలు సక్సెస్ అయ్యాయని, ప్రజల్లో ఎంతో ఆదరణ లభించిందని అన్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ చేసిన మోసాలపై ప్రజల్లో విస్తృత చర్చ నడుస్తోందని అన్నారు. కార్యకర్తలే పార్టీ కథానాయకులైనందున ఈ కొన్ని రోజులపాటు బూత్ స్థాయి నుంచి రేయింబవళ్లూ పనిచేయాలని కోరారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. నామా నాగేశ్వరరావుతోనే రాష్ట్ర, జిల్లా ప్రయోజనాలు సాధ్యమవుతాయని అన్నారు. అందుకని ఈ ఎన్నికల్లో ఆయనను తప్పనిసరిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నిత్యం ప్రజల మధ్యే ఉంటారని అన్నారు. కానీ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎక్కడుంటారో తెలియని దుస్థితి ఉందని విమర్శించారు. ప్రత్యర్థి పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఈసీకి ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను 48 గంటలపాటు ప్రచారానికి దూరం చేశారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం, బుర్రి వెంకట్, పొన్నం వెంకటేశ్వర్లు, వెంకటరమణ, తారపు సుధాకర్, దోరేపల్లి శ్వేత, పగడాల శ్రీవిద్య, వినయ్, పార్థసారథి, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. ఖమ్మం స్థానంలో పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మంచి మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు. 13న జరిగే ఎన్నికల్లో చరిత్ర తిరగరాయబోతున్నామని స్పష్టం చేశారు. పార్టీ ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుందామని అన్నారు. రాష్ట్రంలోని 12 సీట్లలో బీఆర్ఎస్ గెలవబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. కేసీఆర్ సభలకు వచ్చిన జనాన్ని చూసి కాంగ్రెస్కు వణుకు పుట్టిందని అన్నారు. ఆ పార్టీ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అన్నారు.