భద్రాచలం, మే 17: రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు మానె రామకృష్ణ స్పష్టం చేశారు. తదుపరి ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమల్లో సైతం పార్టీ సభ్యులకు ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. అలాగే, ఈ ఏడాది డిజిటల్ పద్ధతిలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భద్రాచలం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును అధికంగా చేయాలని; ప్రతి గ్రామం, వార్డు, కాలనీల్లో విశేషంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి కాలనీ నుంచీ అందరూ సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై భద్రాచలంలోని ఏఎస్ఆర్ కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన పార్టీ శ్రేణుల అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సభ్యత్వ నమోదు ప్రక్రియను పార్టీ అధిష్టానం ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో చేపట్టిందని తెలిపారు. ఈ సభ్యత్వం పొందిన వారు సభ్యత్వంతోపాటు రూ.2 లక్షల ప్రమాద బీమా కూడా పొందుతారని అన్నారు. సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలను కూడా అధిక సంఖ్యలో చేర్పించాలని కోరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలం కావడంతో ప్రజలందరూ ఆ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్కు బుద్ధిచెప్పేందుకు ఎన్నికలు ఎప్పుడొస్తాయోనంటూ ఎదురుచూస్తున్నారని అన్నారు. మరో ఏడాదిన్నర వరకే ఈ ప్రభుత్వానికి గడువు ఉందని అన్నారు. ఆ తరువాత రాబోయే మన కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజల కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. పార్టీ నాయకులు రేపాక పూర్ణచంద్రరావు, తెల్లం కామేశ్వరి, పూజల లక్ష్మి, బాడిస నాగరాజు, తూచిక ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.