ఖమ్మం, ఏప్రిల్ 20 : అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, పింఛన్ రూ.4 వేలు, వరి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో శనివారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి తదితరులతో కలిసి పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రదర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. అని నినాదాలు చేశారు. రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, రూ.500 బోనస్, పింఛన్లను రూ.4వేలకు పెంచుతామన్న హామీలను వెంటనే అమలు పర్చాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
‘పోస్టు కార్డు’ ఉద్యమంలో పాలుపంచుకోవాలి ;బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న పోస్ట్ కార్డు ఉద్యమంలో రైతులందరూ భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శనివారం రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు మణుగూరు మండలంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, 24 గంటల విద్యుత్ అందిస్తామని, రైతుబంధు పథకం కింద రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని హామీలు ఇచ్చి.. ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతి రైతు డిమాండ్లతో కూడిన పోస్టుకార్డులను ‘సీఎం రేవంత్రెడ్డి, తెలంగాణ సెక్రటేరియట్ హైదరాబాద్’కు పంపించాలని కోరారు. రైతులు అధిక సంఖ్యలో భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.