‘కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరించాలి.. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలి.. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయాలి.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి.. సైనికుల్లా కదన రంగంలోకి దూకే విధంగా ఉత్తేజ పరచాలి..’ అన్న సంకల్పంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాలోని వైరా, సత్తుపల్లి, ఎర్రుపాలెం, చండ్రుగొండ, చుంచుపల్లి మండలాల్లో సమ్మేళనాలు జరిగాయి. సమావేశాలకు ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
– నమస్తే నెట్వర్క్
వైరాటౌన్, ఏప్రిల్ 2: తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో ఆదివారం పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి అధ్యక్షతన 10 వార్డులకు పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్రం నిధులు కేటాయించడం లేదన్నారు. మెడికల్ కాలేజీల మంజూరులోనూ వివక్ష చూపుతున్నదన్నారు. బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు నాయకులు అహర్నిశలు పనిచేయాలన్నారు.
ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ చేశానన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. సమ్మేళనంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, దిశా కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జున్రావు, కౌన్సిలర్లు వనమా విశ్వేశ్వరరావు, మరికంటి కుమారి, డాక్టర్ కోటయ్య, చల్లగుండ్ల నాగేశ్వరరావు, తడికమళ్ల నాగేశ్వరరావు, ధనేకుల వేణు, ఇమ్మడి రామారావు, మాదినేని సునీత, దారెల్లి పవిత్రకుమారి, కాపా మురళీకృష్ణ, పసుపులేటి మోహన్రావు, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ వేల్పుల పావని, నాయకులు భూమాత కృష్ణమూర్తి, మిట్టపల్లి సత్యంబాబు, కర్నాటి హనుమంతరావు, వాంకుడోత్ వీరూనాయక్ పాల్గొన్నారు.
అభివృద్ధిని ప్రజలకు వివరించాలి..
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. దేశమంతా భూగర్భజలాలు పాతాళానికి పడిపోతుంటే తెలంగాణలో మాత్రం భూగర్భజలాలు పైకి ఉబికి వస్తున్నాయి. రైతు పక్షపాతిగా కేసీఆర్ పంటలకు 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ ప్రజలకు చేసిన మంచిని వివరించాలి. బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలి. రాజీ లేకుండా పనిచేయాలి.
– ఎంపీ నామా నాగేశ్వరరావు
ప్రజలకు చేసిన మేలేమిటి.. పొంగులేటీ..?
సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీనే విమర్శించే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నైతిక విలువలు లేవు. 2014 నుంచి 2018 వరకు పొంగులేటి ఎంపీగా పనిచేసి ప్రజలకు ఆయన చేసిన మేలు ఏమిటో తెలపాలి. జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్రేమిటో వివరించాలి. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి కావడం లేదని సమావేశాల్లో ఊదరగొట్టే పొంగులేటి, ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి టెండర్లు ఎందుకు వేస్తున్నారో సమాధానం చెప్పాలి.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు
కుట్రలు చేసేవారితో జాగ్రత్త..
కార్యకర్తలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో విజయబావుటా ఎగురవేయాలి. మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలి. ప్రతిపక్షాల కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టాలి. అంతర్గత సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవాలి. పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించాలి.
– బండి పార్థసారథిరెడ్డి , రాజ్యసభ సభ్యుడు
బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించాలి..
సీఎం కేసీఆర్ విజన్తోనే రాష్ట్రంలో నీళ్లూ నిధులు నియామకాలు సాధ్యమయ్యాయి. కేసీఆర్ను మూడోసారి సీఎం చేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలి. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. ప్రతిపక్షాల ఆరోపణలను సహేతుకంగా తిప్పికొట్టాలి. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించేలా కదన రంగంలోకి దూకాలి..
-వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
నైతిక విలువలతో పోరాడాలి..
నేనూ క్రమశిక్షణ గల కార్యకర్తను. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదన్న విషయాన్ని తెలియజేయాలి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకోవాలి.
– సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే