ఖమ్మం, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను మరోసారి రాజ్యసభకు పంపించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు పేరును ఖరారు చేస్తూ ప్రకటన జారీ చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండేళ్ల క్రితం వద్దిరాజుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అనంతరం వద్దిరాజు పార్టీకి విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల గొంతుకను వినిపించారు. గత శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకుని అభ్యర్థుల గెలుపునకు శాయశక్తులా కృషి చేశారు. ఫలితాలు ఏమైనప్పటికీ ఆయన కృషి మాత్రం ఎనలేనిది. ఆయనకు ఇప్పటికే వ్యాపారవేత్తగా జిల్లాలో పేరున్నది. అలాగే సౌమ్యుడిగా, పేదల పెన్నిధిగా పేరు తెచ్చుకున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజును ప్రకటించడంపై గులాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్ఠాన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.
రాజ్యసభ పరిధిలో ముగ్గురి స్థానాలు ఖాళీ అవుతుండగా వాటిలో రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, ఒక స్థానం బీఆర్ఎస్కు దక్కాయి. దీనిలో భాగంగా బీఆర్ఎస్ తరఫున వద్దిరాజుకు అవకాశం లభించింది. ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి రాజ్యసభ సభ్యులుగా వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, లోక్సభ సభ్యుడిగా నామా నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తుండగా వీరిలో వద్దిరాజుకు తిరిగి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం రావడం విశేషం. దీన్ని బట్టి గులాబీ బాస్ జిల్లాకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో చెప్పకనే చెప్పవచ్చు. కాగా.. గురు వారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా రేణుకా చౌదరికి ఆ పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. దీంతో జిల్లా నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు పెద్దల సభలో తమ గొంతుక వినిపించే అవకాశం ఉందని, మున్ముందు జిల్లా ప్రజలకు మరింత మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.