కూసుమంచి (నేలకొండపల్లి)/ ఖమ్మం రూరల్, నవంబర్ 7: బీఆర్ఎస్ సర్కారులో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాయని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని అన్నారు. పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తాను శక్తివంచన లేకుండా పనిచేశానని గుర్తుచేశారు. నేలకొండపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. అనాసాగరం, సదాశివపురం, రామచంద్రాపురం, సుర్దేపల్లి, పైనంపల్లి, భైరవునిపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ పాలేరు నియోజకవర్గమంతటికీ దళితబంధు పథకాన్ని అమలు చేస్తారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, పార్టీ పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త తాళ్లూరి జీవన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలతో ఎమ్మెల్యే కందాళ కూడా తన సొంత నిధులతో నియోజకవర్గంలోని అనేక మంది పేదలను ఆదుకున్నారని అన్నారు. ప్రజాప్రతినిధుల, బీఆర్ఎస్ నాయకులు మరికంటి ధనలక్ష్మి, వజ్జా రమ్య, నంబూరి శాంత, ఉన్నం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్ మండల కేంద్రంలోని పెద్దతండా పంచాయతీ యువకులు పెద్ద సంఖ్చలో వచ్చి ఎమ్మెల్యే కందాళకు మద్దతు పలికారు. ఈ మేరకు మంగళవారం వారంతా మండలంలోని ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో కందాళను కలిశారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు గిస్కా కృష్ణ, బానోత్ మోహన్, రెడ్యానాయక్, గడ్డా వీరన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.