ఖమ్మం, నవంబర్ 17: సీఎం కేసీఆర్ సహకారం వల్లనే ఖమ్మం నియోజకవర్గం ఇంతలా అభివృద్ధి చెందిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అందుకోసం నియోజకవర్గ ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ఖమ్మం నగరంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. 53, 54, 55, 56 డివిజన్లలో విస్తృత ప్రచారాలు, రోడ్షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇక్కడి వాడినని, అందుకే ఇక్కడి ప్రజలు తనను రెండుసార్లు గెలిపించారని గుర్తుచేశారు. అందుకే ఖమ్మంపై ఉన్న మమకారంతో తాను ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. కానీ బయటి వ్యక్తులెవరూ ఖమ్మంపై ఇంత ప్రేమ చూపించలేరని అన్నారు. ఖమ్మం నియోజకవర్గం మరింత ప్రగతి సాధించాలంటే ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఖమ్మంలో కాకరకాయలు కూడా పంచని వాళ్లంతా ఇప్పుడొచ్చారని, ఎన్నికల వేళ ఎన్నో కహానీలు చెబుతున్నారని విమర్శించారు. అభివృద్ధిని కాంక్షించే వాళ్లెవరో, వెన్నుపోటు పొడిచే వాళ్లెవరో నియోజకవర్గ ప్రజలు గమనించాలని కోరారు. ఒకప్పుడు కనీస సదుపాయాలు లేని ఖమ్మాన్ని తానే తీర్చిదిద్దానని, అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిపానని అన్నారు. లకారం ట్యాంక్బండ్, ఐటీ హబ్, పార్కులు, ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశానని వివరించారు. ఇవేగాక నూతన బస్టాండ్, ధంసలాపురం ఆర్వోబీ, నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనం వంటివన్నీ కళ్లముందే కన్పిస్తున్నాయని అన్నారు. మరింత అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి తనకు అధిక మెజార్టీ అందించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మేయర్ పునుకొల్లు నీరజ, కూరాకుల నాగభూషణం, మోతారపు శ్రావణి, సుధాకర్, పైడిపల్లి రోహిణి, సత్యనారాయణ, చిరుమామిళ్ల లక్ష్మి, నాగేశ్వరరావు, కర్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.