ఖమ్మం, అక్టోబర్ 14: బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ ఎన్నికల లోపు కనీసం మూడుసార్లు వెళ్లాలని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని రోటరీనగర్ మమత ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన పార్టీ బూత్ లెవల్ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ఇంకా 45 రోజుల సమయం మాత్రమే ఉందని, ప్రతి ఒక్కరూ ఇతరత్రా పనులు పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. ప్రతి కార్పొరేటర్ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో పార్టీ డివిజన్ అధ్యక్షుడు, కార్యదర్శులను కలుపుకోవాలన్నారు. ప్రతి బూత్ను సందర్శించి ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని కోరాలని సూచించారు. అలాగే రఘునాథపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు పర్యటించాలని ఆదేశించారు. నెలాఖరు నుంచి ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్, రఘునాథపాలెం మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలన్నారు.
ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. ఎన్నికల్లో ఎవరు.. ఏ బాధ్యతలు చేపట్టాలో ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యర్థి అన్నారు. నవంబర్ 5వ తేదీ సాయంత్రం ఖమ్మం నగరంలో జరుగనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలన్నారు. ఎన్నికల ప్రచారం చివరలో మంత్రి కేటీఆర్ రోడ్ షొ ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్తకు గెలుస్తామనే విశ్వాసం ఉండాలే కానీ, అతివిశ్వాసం ఉండొద్దన్నారు. అతివిశ్వాసంతో నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రతి కార్యకర్త ఇక కథానాయకుడు కావాలన్నారు. ఓటరు జాబితాపై డివిజన్ అధ్యక్షులు, నాయకులపై అవగాహన ఉండాలన్నారు. సమావేశంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డీసీఎంఎస్ చైర్మన రాయల శేషగిరిరావు, రఘునాథపాలెం జడ్పీటీసీ ప్రియాంక, ఇతర ప్రజాప్రతినిధులు, కార్పొరేట్లు, బీఆర్ఎస్ నాయకులు వీరూనాయక్, గుత్తా రవి, అఫ్జల్, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, పగడాల నాగరాజు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి పాల్గొన్నారు.
పువ్వాడను భారీ మెజార్టీతో గెలిపించాలి
తెలంగాణవ్యాప్తంగా అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఖమ్మం నియోజకవర్గం ఒకటి. అంతటి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మరోసారి ఎన్నికల్లో గెలిపించాలి. ప్రతి కార్యకర్త మానసికంగా దృధంగా ఉండాలి. ఎన్నికల సమయం ఆసన్నమైనందున ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లాలి. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ను గెలిపించి సీఎంగా కేసీఆర్, ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కృషి చేయాలి. ఖమ్మం జిల్లాలో పార్టీ అధినేత కేసీఆర్ కొందరికి పదవులు ఇస్తే వారు ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ నుంచి బయటకు వెళ్లారు. ఇప్పుడు కేసీఆర్నే విమర్శిస్తున్నారు. వారి ఎత్తుగడలను నాయకులు తిప్పికొట్టాలి. – ఎమ్మెల్సీ తాతా మధు