ఖమ్మం, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా నది పరిధిలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో మంగళవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు. జలాల విషయంలో తెలంగాణ రాష్ర్టానికి జరుగనున్న అన్యాయం, భవిష్యత్లో సాగు, తాగునీటికి పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన బహిరంగ సభకు పది నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేసేందుకు వారం రోజులుగా మండల, నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ముఖ్య కార్యకర్తలను సమాయత్తం చేస్తూ.. బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను సైతం ఎక్కడికక్కడ ఆవిష్కరించారు. కృష్ణా ఆయకట్టు పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లాకు భవిష్యత్లో సాగు, తాగునీటి కొరత పొంచి ఉంది. అంతేకాక నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ ఈ సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును ప్రజలకు, సాగు రైతులకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు జిల్లాలతోపాటు భారీ జనసమీకరణ చేయాలని నిర్ణయించింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర, వైరా, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో నల్గొండ సభపై బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ బాధ్యులు విస్తృతంగా ప్రచారం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు నల్గొండ సభకు ఆయా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలనే ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం జిల్లాలోని కార్యకర్తలను నల్గొండ సభకు తరలించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సన్నాహక సమావేశాలు నిర్వహించడంతోపాటు బహిరంగ సభ పోస్టర్లు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డిలు చలో నల్గొండ పోస్టర్ను ఆవిష్కరించి.. జనసమీకరణపై దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం నుంచి ప్రత్యేకంగా బస్సులు, వాహనాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నుంచి కనీసం 50 బస్సులు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ అభిమానులు స్వచ్ఛందంగా వాహనాల్లో సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సహకార సంఘాల అధ్యక్షులు, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు సభలో పాల్గొనేలా పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
సభలో ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, బానోతు హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, వైరా మాజీ ఎమ్మెల్యేలు బానోతు మదన్లాల్, లావుడ్యా రాములునాయక్ తదితరులు పాల్గొననున్నారు. అనేక మంది నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ఛలో నల్గొండ సభకు ఫ్లెక్సీలు, బ్యానర్లు ధరించి తరలేందుకు సిద్ధమయ్యారు.
సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 12 : నల్గొండలో మంగళవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ‘చలో నల్గొండ’ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా చూడాలన్నారు. ప్రతి గ్రామానికి బస్సులు ఏర్పాటు చేశామని, వాటిని బీఆర్ఎస్ శ్రేణులు సద్వినియోగం చేసుకుని సభకు తరలిరావాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, యాగంటి శ్రీనివాసరావు, తుమ్మూరు దామోదర్రెడ్డి, రఫీ, మల్లూరు అంకమరాజు పాల్గొన్నారు.