భద్రాచలం, ఏప్రిల్ 12 : వసంతపక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం ప్రాకార మండపంలో ఉత్సవ పెరుమాళ్లకు ప్రత్యేక స్నపన తిరుమంజనం జరిపారు. తర్వాత యాగశాలలో బింబం, కుంభం, మండలం, అగ్నితో చతుఃస్థానార్చన చేపట్టారు. ప్రాకార మండపంలో వేదశాస్త్ర, ఇతిహాస పురాణాదులను వేద పండితులు పఠించారు. శుక్రవారం సందర్భంగా ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారమ్మ వారి సన్నిధిలో అమ్మవారికి పంచామృతాభిషేకం, తొమ్మిది రకాల పళ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అంతరాలయంలోని మూలవరులకు బెంగుళూరుకు చెందిన భక్తులు రూ.5 కోట్లతో తయారు చేయించి సమర్పించిన సర్వాంగ స్వర్ణ కవచాలను ధరింపజేశారు. సాయంత్రం రామయ్య తండ్రికి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ జరిపారు.
భద్రాచలంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న శ్రీరామ నవమి, సీతారాముల కల్యాణ ఏర్పాట్ల పురోగతిపై కలెక్టర్ ప్రియాంక ఆల భద్రాచలంలో శనివారం సమీక్షించనున్నారు. స్వామివారి కల్యాణానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో పనుల తీరుపై సమీక్ష చేయనున్నారు. 16న స్వామివారికి ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవం నేత్రపర్వంగా జరుపనున్నారు. 17న మిథిలా ప్రాంగణంలో సీతారాముల కల్యాణం, 18న రామయ్యకు మహా పట్టాభిషేకం మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం పూర్తయిన తర్వాత సాయంత్రం భద్రుని మండపంలో పునర్వసు దీక్షలను ప్రారంభిస్తారు.