భద్రాచలం, ఏప్రిల్ 8 : ఉగాది రోజున మంగళవారం భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఉదయం అంతరాలయంలోని ధ్రువమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకొని ధ్వజారోహణం చేయనున్నారు.
వేడుకల ప్రారంభానికి ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణ పుణ్యాహవాచన, రుత్విగ్వరణం, రక్షాబంధనం, స్నపన తిరుమంజనం, వాస్తు హోమం, ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఉగాది ప్రసాద వితరణ, సాయంత్రం దర్బార్ సేవ తర్వాత నూతన పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు. అలాగే కల్పవృక్ష వాహనంపై తాత గుడి సెంటర్ వరకు స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు.
శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ నెల 16 సాయంత్రం నేత్రపర్వంగా ఎదుర్కోలు ఉత్సవం, 17న సీతారాముల కల్యాణం, 18న మహా పట్టాభిషేకం నిర్వహించనున్నాం. మిథిలా ప్రాంగణంలో జరిగే వేడుకల కోసం కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి భక్తునికి స్వామివారి తలంబ్రాలు అందేలా ఈసారి 60 తలంబ్రాల కౌంటర్లు, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు కొనుగోలు చేసేందుకు 19 కౌంటర్లను ఏర్పాటు చేశాం. భక్తుల సౌకర్యం కోసం 2.50 లక్షల లడ్డూలు, 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశాం.
ఆర్టీసీ బస్సుల్లో కూడా స్వామివారి తలంబ్రాలను భక్తులకు అందజేస్తాం. ఆర్టీసీ కార్గో, తపాలా శాఖ ద్వారా కూడా భక్తులకు తలంబ్రాలను ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఈ నెల 17 ఉదయం 6 గంటల వరకు ఒరిజినల్ టికెట్లను అందజేస్తాం. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎదుర్కోలు ఉత్సవానికి రాష్ట్ర మంత్రులు, శ్రీరామ నవమికి సీఎం రేవంత్రెడ్డి వస్తారని, కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల కమిషనర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొచ్చే అవకాశం ఉంది.