భద్రాచలం, మార్చి 22: భద్రాద్రి దివ్యక్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి వసంత పక్ష బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 5 వరకు ఇవి కొనసాగనున్నాయి. శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. భద్రాచలం పట్టణమంతా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాతగంగా ఉదయం ఉత్సవమూర్తులకు, నిత్య కల్యాణ మూర్తులకు, అంతరాలయంలోని మూలవరులకు ఉత్సవారంభ స్నపనం నిర్వహించారు.
చిత్రకూట మండపంలో ఉత్సవ పెరుమాళ్లకు బ్రహ్మోత్సవం, పుష్కర పట్టాభిషేకానికి సంకల్పం చేశారు. విశ్వక్సేన ఆరాధనతో మొదలుపెట్టి భగవత్ పుణ్యాహవచనం, ప్రదక్షిణ, రక్షా బంధన, పుణ్య జలాల సంప్రోక్షణ, కంకణధారణ పూర్తి చేశారు. ఉప ప్రధానార్చకుడు సీతారామాచార్యులు ప్రోక్షణ గావించుకొని నూతనంగా నిర్మించిన ద్వాదశ కుండాత్మక యాగశాలలను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. మ ధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి రాజభోగం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు వచ్చిన ఆర్డీవో రత్న కల్యాణి దంపతులను సత్కరించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారిని ప్రత్యేక పల్లకీలో తాతగుడి సెంటర్లో ఉన్న శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయానికి తీసుకెళ్లి పుట్టమన్నుతో పూజా కార్యక్రమాలు ముగించారు. రాత్రి 8 గంటలకు తిరువీధి సేవ జరిపారు.
నేటి నుంచి తిరువారాధన
నూతనంగా నిర్మించిన ద్వాదశ కుండాత్మక యాగశాలల్లో గురువారం నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు తిరువారాధన, సేవాకాలం, తీర్థగోష్ఠి, శ్రీరామాయణ మహాక్రతువు, సంక్షేమ రామాయణ సామూహిక పారాయణం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, హోమాలు, ప్రవచనాలు నిర్వహించనున్నారు.