అమ్మవారికి ఆషాఢ మాసం బోనం సమర్పణ
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా
అశ్వారావుపేట టౌన్, జూలై 3 : అశ్వారావుపేట పట్టణ పరిధిలోని గుర్రాలచెరువు గ్రామంలో ఆదివారం బోనాల సందడి నెలకొన్నది. గ్రామ సమీపంలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారికి భక్తులు ఆషాఢమాసం బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని బోనం ఎత్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ద్వారం వద్ద ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి సన్నిధిలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని ప్రత్యేక పాత్రలో వండుకుని అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చారు. బోనాలను నెత్తిన ధరించి మేళతాళాలతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి సన్నిధికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జారే ఆదినారాయణ, సర్పంచ్ కలపాల దుర్గయ్య, మాజీ వైస్ ఎంపీపీ మందపాటి రాజమోహన్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ, గొడవర్తి వెంకటేశ్వరావు, నిర్వాహకులు వ్యాఘ్నేశ్వరరావు, కలపాల శ్రీను, ఆల సత్యనారాయణ, నారాయణ పాల్గొన్నారు.