అవస్థలు పడుతున్న వాహనదారులు
బోనకల్లు, జూలై 28 : మండల కేంద్రంలోని ఆళ్లపాడు పాతగేటు సమీపంలో రైల్వేశాఖ అండర్బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. సంబంధిత కాంట్రాక్టర్ అండర్బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం చేయడంతో వాహనదారులు, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 8 నెలలుగా అండర్బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, రైతులకు ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేశారు. ఇది వర్షం వస్తే బురదమయం కావడంతో రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మోటమర్రి, రాయన్నపేట, ఆళ్లపాడు, గోవిందాపురం గ్రామాలకు చెందిన వారంతా ద్విచక్రవాహనాలు, ఆటోల ద్వారా రైల్వేట్రాక్ పక్కన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ మార్గమంతా వర్షానికి చిత్తడిగా మారి వాహనదారులు, ప్రజలకు అసౌకర్యంగా ఉంది. పాదచారులు నడిచేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు రైల్వే అండర్బ్రిడ్జి పనులను వేగవంతం చేసి రహదారి సౌకర్యాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.