ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 28: తేజారకం ఎండుమిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటా ధర రూ.21,650 పలకడంతో పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఇదే మార్కెట్లో సాధారణ రకం తేజా పంటకు గరిష్ఠ ధర క్వింటాకు రూ.18 వేలు పలకగా.. మూడు రోజుల క్రితం రూ.21,600 పలికింది. మంగళవారం మరో రూ.50 అదనపు ధర రావడంతో మూడు రోజుల క్రితం నమోదైన రికార్డు తిరగరాసినట్లయింది. ఉదయం మిర్చియార్డుకు ఆయా జిల్లాల నుంచి 41,141 బస్తాలను రైతులు తీసుకొచ్చారు. అనంతరం జరిగిన జెండాపాటలో పంటను దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. దీంతో గరిష్ఠ ధర రూ.21,650కు చేరింది. మధ్య ధర రూ.20 వేలు కాగా, కనిష్ఠ ధర రూ.14 వేల చొప్పున ధర నిర్ణయించి వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు. తాలు రకం ధర కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.12 వేలు పలకడం విశేషం. మార్కెట్కు నాణ్యమైన పంటను తీసుకొచ్చి జాతీయస్థాయిలోనే ఏ రైతూ సొంతం చేసుకోలేని విధంగా అధిక ధరన పొందిన వైరా మండలం పినపాక గ్రామానికి చెందిన రైతు ఎం.రాంబాబును ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, సెక్రటరీ ఆర్.మల్లేశం మార్కెట్ యార్డులో సన్మానించారు. గ్రేడ్ టూ అధికారి బజార్, అసిస్టెంట్ సెక్రటరీ డీ.నిర్మల, మిర్చి శాఖ అధ్యక్ష కార్యదర్శులు మాటేటి నాగేశ్వరరావు, సతీశ్, దిగుమతి శాఖ అధ్యక్షుడు దిరిశాల వెంకటేశ్వర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు జీవై నరేశ్ తదితరులు పాల్గొన్నారు.