మామిళ్లగూడెం, ఏప్రిల్ 22: ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో నాలుగో రోజు సోమవారం నాడు 11 నామినేషన్లు స్వీకరించినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా దండా లింగయ్య 3 సెట్లు, తేజావత్ జోగురాము స్వతంత్ర అభ్యర్థిగా 2 సెట్లు, అంతోని సురేశ్ బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా ఒక సెట్, ఎదురుగట్ల చిట్టిమల్లు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్,
ఉళ్లేంగుల యాదయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఒక సెట్, స్వతంత్ర అభ్యర్థిగా మరొక సెట్, మద్దిశెట్టి ఎర్రప్ప స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్, మద్దినేని అనిల్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు దాఖలు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా నాలుగు రోజుల్లో 15 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. కాగా, నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు గడువు ఉంది. ఈ చివరి రోజుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
మహబూబాబాద్, ఏప్రిల్ 22: మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మరో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్, యూసీసీఆర్ఐఎంఎల్ పార్టీ అభ్యర్థిగా పగిడి ఎర్రయ్య, స్వతంత్ర అభ్యర్థిగా మైపతి అరుణ్కుమార్ సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆర్వో, కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్కు తమ నామపత్రాలను అందించారు. అదే విధంగా పాల్వంచ దుర్గ అనే స్వతంత్ర అభ్యర్థి మరోమారు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందించారు. కాగా, ఈ స్థానానికి ఇప్పటి వరకు వివిధ పార్టీల అభ్యర్థులుగా, స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు.