తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం వారు ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నదన్నారు. నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. తెలంగాణ అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, తమను తెలంగాణలో కలపాలని ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి విలువ డాలర్ కంటే నానాటికీ పడిపోతున్నదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.
ఖమ్మం జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఖమ్మం రూరల్: తెలంగాణ సమాజానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఖమ్మం రూరల్, కూసుమంచి, కల్లూరు, తల్లాడ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తయిన అభివృద్ధి పనులు, భవనాలు, రోడ్లను ప్రారంభించారు. తొలుత రూరల్ మండలంలోని కామంచికల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మాట్లాడారు. నిరుపేదల కోసం రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నదన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుతున్నదన్నారు.
తమనూ తెలంగాణలో కలపాలని ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన సరిహద్దు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారన్నారు. అక్కడి పాలకులపై ఈ మేరకు ఒత్తిడి పెరుగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రజలు మన్ననలు పొందుతూ ఉంటే ప్రధాని మోదీ మాత్రం ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే నానాటికీ పడిపోతున్నదన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100కు చేరుకున్నదన్నారు. నిత్యావసర ధరలు ఆకాశానికి అంటాయన్నారు. బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. నాటి పాలేరు నియోజకవర్గానికి నేటి పాలేరుకు ఎంతో తేడా ఉందన్నారు.
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పాలేరును పచ్చగా మార్చారన్నారు. ఎమ్మెల్యేను కందాళను ఓడించాలనే ఉద్దేశంతో బీజేపీ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారన్నారు. వారికి పాలేరు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఖమ్మం నగర మేయర్ పి.నీరజ, రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా డైరక్టర్ గూడ సంజీవరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పేద ప్రజలకు మౌలిక వసతుల కల్పన..
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
దశాబ్దాల తరబడి కామంచికల్, పాపటపల్లి, దారేడు, దానవాయిగూడెం, రామన్నపేట ప్రజలు రవాణా సమస్యతో బాధపడుతున్నారని మంత్రి అజయ్ అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నదన్నారు. రూ.కోట్లతో రహదారులు నిర్మిస్తున్నదన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నది. అవి పూర్తయితే జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. గుజరాత్లో ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందన్నారు. సీఎం కేసీఆర్ తనదైన విజన్తో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. పేద ప్రజలకు మౌలిక వసతుల కల్పిస్తున్నారన్నారు. స్వరాష్ట్రం వచ్చిన కొత్తలో రాష్ట్రం 740 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పరిమితం కాగా నేడు అది 24వేల మెగావాట్లకు చేరుకున్నదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 5వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు అన్ని విడతల్లో రూ.64 వేల కోట్ల రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. నెలనెలా రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల మందికి పింఛన్ అందుతున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకు పది ఎమ్మెల్యేలు స్థానాలు బీఆర్ఎస్వేనన్నారు. దశాబ్దాలుగా గోదావరి బ్రిడ్జిపై వంతెన నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో మరింత అభివృద్దిని చేసుకోవాలంటే పదికి పది సీట్లు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
చరిత్రను తిరగరాసిన సీఎం కేసీఆర్.. : ఎంపీ నామా నాగేశ్వరరావు
అనతికాలంలోనే రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నిలిపి సీఎం కేసీఆర్ చరిత్ర తిరగరాశారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి పాలనలో ఉనికి కోల్పోయిన వ్యవసాయరంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చారన్నారు. నాడు కరెంట్ కోతలతో అల్లాడిన రైతులకు వరాలిచ్చారన్నారు. పంటలకు ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఇస్తున్నారన్నారు. కేసీఆర్ అభివృద్ధిని మోడల్గా తీసుకుంటే బీజేపీ నాయకులు మాత్రం కుట్రలు పన్నుతున్నారన్నారు. బీజేపీ తరఫున గెలిచిన పార్లమెంట్ సభ్యులు రాష్ర్టానికి ఏం తీసుకువచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు నమ్ముకొని విషప్రచారం చేయడం తప్ప బీజేపీతో ప్రజలకు ఒరిగింది ఏమీలేదన్నారు.
సీఎం కేసీఆర్ వైపు దేశం చూస్తున్నది..
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
ఇప్పుడు యావత్ భారతదేశం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు కేసీఆర్ను కలుస్తున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు యావత్ దేశానికి వర్తింపజేయాలని కోరుతున్నారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పదికి పది గెలుచుకుంటుందన్నారు. సంక్షేమ సారథిని మరోసారి సీఎంగా చూసుకోవాలన్నారు.
గడప గడపకూ పథకాలు:
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి
సంక్షేమ పథకాలు గడప గడపకూ అందుతున్నాయని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో అండర్ రైల్వే బ్రిడ్జి, రోడ్ విస్తరణకు నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మరో చిరకాల వాంఛ అయిన పల్లెగూడెం- మంగళగూడెం రోడ్డు విస్తరణ సాకారమైందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో ఇప్పటికే మున్నేటిపై రెండు చెక్డ్యాంలు నిర్మించామన్నారు. పాలేరు ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇండ్లు నిర్మిస్తామన్నారు.
అభివృద్ధికి అంబాసిడర్ సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్
అభివృద్ధికి అంబాసిడర్గా కేసీఆర్ నిలుస్తున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు అనేక ఫలాలు అందించారన్నారు. పంటలకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందజేస్తురని అన్నారు. దానవాయిగూడెం నుంచి పాపటపల్లి వరకు విస్తరణ పనులు ప్రారంభమవడం ఆనందదాయకమన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. నేడు యావత్ దేశ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణ మోడల్గా దేశాభివృద్ధి కోరుకుంటున్నారన్నారు.
ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించాలని :
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర కోరారు. జిల్లా తెలంగాణ, ఆంధ్రాకు సరిహద్దు అన్నారు. కేవలం కొన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆంధ్రా గ్రామాలు కనిపిస్తాయన్నారు. అక్కడి రహదారులను మన రహదారులను పోల్చి సీఎం కేసీఆర్ సాధించిన అభివృద్ధి చూడవచ్చన్నారు. ప్రజలే దేవుళ్లు, రాష్టం అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదన్నారు. పాలేరు అభివృద్ధిలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తనదైన ముద్ర చూపించారన్నారు. దశాబ్దాల కల అయిన కామంచికల్ రోడ్ విస్తరణ పనులకు మోక్షం కల్పించారన్నారు.
రైతుల పిల్లలకు విద్యారుణాలు :
డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం
రైతులకు పంటరుణాలతో పాటు వారి పిల్లల చదువులకు విద్యారుణాలు అందిస్తున్నామని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు వందలాది రుణాలు అందించామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో పంట రుణాలు రైతుకు అందితేనే సాగు సాగేదన్నారు. ఇప్పుడు పంటలకు ఉచిత కరెంట్ అందుతున్నదన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రైతులు ఆర్థికాభివృద్ధి సాధించారన్నారు.
బీఆర్ఎస్లోకి ‘కాంగ్రెస్’ కార్పొరేటర్
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఖమ్మంలోని 60 డివిజన్ కార్పొరేటర్ నిరంజన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.