రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు.. పేదల బియ్యం వారికే పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఎంఎల్ఎస్ పాయింట్లు, రేషన్ డీలర్ల వద్ద అవకతవకలు జరగకుండా కట్టడి చేస్తోంది. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ అమలు చేస్తుండగా.. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కూడా ఆ విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించింది. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా.. బస్తా తూకంలో తేడా లేకుండా.. డీలర్లు నష్టపోకుండా.. కార్డుదారులకు సక్రమంగా బియ్యం అందించేలా ప్రభుత్వం పూనుకున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు బయోమెట్రిక్తోనే శ్రీకారం చుట్టింది.
-ఖమ్మం, జూలై 5
ఖమ్మం, జూలై 5: ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి రేషన్ పంపిణీలో అనేక అవకతవకలు జరుగుతుండేవి. దీనిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతమవుతోంది. నిరుపేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇప్పటికే రేషన్షాపు ల్లో ఈ-పాస్ యంత్రాల ద్వారా బయోమెట్రిక్ విధానంలో బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. తాజాగా ఎంఎల్ఎస్ (మండల లెవల్ స్టాక్) పాయింట్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది..రేషన్ డీలర్లు గానీ, వారి కుటుంబ సభ్యుల్లోని వ్యక్తులు గానీ ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేస్తేనే సంబంధిత గ్రామానికి రేషన్ కేటాయింపు, విడుదల వంటివి జరుగుతాయి. గతంలో అయితే రేషన్ డీలర్ ఎంఎల్ఎస్ పాయింట్లకు రాకుండానే బియ్యం విడుదల చేసేవారు..మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి సంబంధిత వీఆర్ఏ లారీల వెంట వచ్చి రేషన్ షాపుల్లో బియ్యం దిగుమతి చేసేవారు. అలాంటిది ప్రస్తుతం రేషన్ డీలర్ తప్పనిసరిగా ఎంఎల్ఎస్ పాయింట్కు వచ్చి వేలిముద్ర వేసేలా నిబంధనలు మార్చారు.
అక్రమాల కట్టడి ఇలా..
50 కేజీల బస్తాలను రేషన్ దుకాణాలకు పంపించి అక్కడ నుంచి ప్రజలకు సరఫరా చేస్తారు. అయితే రేషన్ దుకాణానికి బియ్యం దిగుమతి అయ్యేవరకు 50 కేజీల బస్తాలో పూర్తి బియ్యం ఉండవు. ఎంఎల్ఎస్ పాయింట్లలో జరిగే అక్రమాల కారణంగా ఒక్కో బస్తాలో 40 కేజీల నుంచి 45 కేజీల వరకు మాత్రమే ఉంటాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద తూకం ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్లు అనేకసార్లు విన్నవించినా అధికారులు స్పందించేవారు కాదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రేషన్ పంపిణీలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. దీనికి తోడు రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ విధానం, తూకంలో ఎలక్ట్రానిక్ కాటా వినియోగం వంటివి రావడంతో ప్రజలు రేషన్ డీలర్ల వద్ద నుంచి బియ్యం తీసుకునే సమయంలో తూకం తక్కువ వస్తే ప్రశ్నిస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి తక్కువ తూకంతో బస్తాలు వస్తుండడంతో ఆ నష్టాన్ని డీలర్లు భరించాల్సి వచ్చేది. వీటన్నింటికీ చెక్ పెడుతూ రాష్ట ప్రభుత్వం పటిష్ట విధానాన్ని తెచ్చింది. అక్కడ కూడా బయోమెట్రిక్ వినియోగిస్తుండడంతో అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంది.
ఖమ్మం జిల్లాలో 8 ఎంఎల్ఎస్ పాయింట్లు..
ఖమ్మం జిల్లాలో ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, మధిర, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, కల్లూరుల్లో మండల లెవల్ స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వీటి నుంచి జిల్లాలోని 748 రేషన్ దుకాణాల ద్వారా 4,12,083 రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 7 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ పాయింట్ల నుంచి స్టేజీ -2 కాంట్రాక్టర్ ద్వారా లారీల్లో బియ్యాన్ని చేరవేస్తారు.
డీలర్ వస్తేనే బియ్యం సరఫరా..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లలో రేషన్ డీలర్లు వేలిముద్ర వేస్తేనే ఆయా దుకాణాలకు బియ్యం చేరతాయి. ఈ విధానం ద్వారా తూకంలో తేడా లేకుండా బియ్యం సక్రమంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. రేషన్ డీలర్ తప్పకుండా ఎంఎల్ఎస్ పాయింట్కు వెల్లి వేలిముద్ర వేయాలి.
-నర్సింహారావు, సివిల్ సప్లయీస్ అసిస్టెంట్ మేనేజర్, (టెక్నికల్)